నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

పలువురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు
పలు ఎంఎంటిఎస్‌ రైళ్ల రద్దు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: హైదరాబాద్‌ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రైలు నాంపల్లి స్టేషన్‌లో ఆగే క్రమంలో డెడ్‌ ఎండ్‌ గోడను ఢీకొట్టింది. దాంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంతో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్‌ (నాంపల్లి) నుంచి మేడ్చెల్‌ (47244), మేడ్చల్‌ నుంచి హైదరాబాద్‌ (47251) ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై.. దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేష్‌ మాట్లాడుతూ.. ట్రైన్‌ డెడ్‌ ఎండ్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఎస్‌ టూ, ఎస్‌ త్రీ, ఎస్‌ సిక్స్‌ బోగీలు ఈ ప్రమాదంలో పట్టాలు తప్పాయన్నారు.

రైలు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని.. ఇప్పుడే ప్రమాదానికి కారణాలు చెప్పలేమని అన్నారు. రైలు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారని వారికి రైల్వే హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోందని అన్నారు. ప్రయాణికులంతా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లోనే దిగిపోయారని రాకేష్‌ తెలిపారు. రైలు ప్రమాదంతో నాంపల్లికి వచ్చే పలు ఎంఎంటీఎస్‌ రైళ్ళను రద్దు చేశామన్నారు. రైలు ప్రమాదంపై కమిటీ దర్యాప్తు చేస్తోందన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తి అవుతాయని రాకేష్‌ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *