ద్యూత క్రీడ

బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

ధృతరాష్ట్రుడు విదురునితో సంప్రదించి చెబుతానన్నాడు. ధుర్యోదనుడు మాత్రం తన అభిమతం నెరవేరకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ధృతరాష్ట్రుడు అంత పనిచేయవద్దని చెబుతూ, సహస్రస్థంభాలతో, నూరు ద్వారాలు కలిగి, చిత్ర విచిత్రమూన కళారూపాలు కలిగిన మనోహరమైన సభాభవన నిర్మాణాన్ని ఆరంభించమన్నాడు. విదురుడు మాత్రం రాబోయే ప్రమాదాల గురించి చెప్పినా, ధృతరాష్ట్రుడు తన కుమారుడు కోరిన మేరకే చేశాడు. ఇక చేసేదేమి లేక విదురుని పాండవులను తోడుకుని రమ్మని పంపాడు. పాండవులు విదురుని సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలూ జరిపారు. ధర్మరాజాదులకు విదురి ముఖంలో ఏదో విచారం కనిపించింది. కారణం అడిగారు. విదురుడు జరిగిన విషయం చెప్పాడు. ఇక చేసేదేమిలేక ధృతరాష్ట్రుని ఆజ్ఞను మీరలేక సోదరసమేతంగా హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. హస్తినాపురం చేరి భీష్మ, ద్రోణ, కృపాచార్యాది కుల గురువులకు అభివాదం చేసి, ఆపైన దుర్యోదన, శకుని ఆదిగా గల వారిని కుశల ప్రశ్నలడిగి, ఆపైన గాంధారికి నమస్కరించి, ధృత రాష్ట్రునికి వందనం గావించారు. ఆయన ఆజ్ఞప్రకారం సభాభవనం దర్శించారు. ధుర్యోదనుడి భార్య భానుమతి, ఆయన సోదరి దుశ్శల, ద్రౌపదికి స్వాగతం పలికారు. ద్రౌపది సౌందర్యాన్ని చూసినారీ జనమంతా అసూయపడ్డారు.

రెండవరోజున పాండవులు సభాభవనానికి వచ్చారు. రాగానే శకుని చేతులో పాచికలను  పెట్టుకుని ఆడిస్తూ, పాండుకుమారుడు ధర్మరాజును ద్యూతక్రీడకు ఆహ్వానించాడు. ధర్మరాజుకు ద్యూత క్రీడ అంటే ఇష్టమన్న విషయం శకునికి తెల్సును. ధర్మరాజు ద్యూతం వినోదభరితమే అయినా, కలహహేతువు కదా అన్నాడు. అప్పుడు శకుని ధర్మరాజుతో ద్యూత క్రీడ మర్మాలు తెల్సిన తానే భయపడుతున్నాడంటే ఆశ్యర్యంగా ఉందన్నాడు. జయపజయాలు దైవాదీనాలు అని తాము నమ్ముతున్నామంటూ ధర్మరాజుని మరీమరీ కవ్వించాడు. యుద్ధానికీ, ద్యూత క్రీడకూ ఆహ్వానం వస్తే తిరస్కరించరాదన్నాడు. ధర్మరాజు చివరకు సరేనని చెప్పి ‘ఎవరితో ఆడాలో చెప్పమన్నాడు’. ధుర్యోదనుడు కల్పించుకుని నా బదులు శకుని మీద ఆడతాడన్నాడు.

 (మిగతా..వొచ్చేవారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *