పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా ముందుకు
మౌలిక వసతుల కల్పలకు అధిక ప్రాధాన్యం
వికసిత్ భారత్ దిశగా ప్రభుత్వం ముందుకు..
నీట్, నెట్ పేపర్ లీకేజీపై కఠిన చర్యలు
ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 27: దేశ అభివృద్ధే మనందరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని తెలిపారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్య మిచ్చామని తెలిపారు. 18వ లోక్సభ తొలి సమావేశాల నాలుగవ రోజు ఆమె పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేందప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు. మొదటగా ఆమె కొత్తగా గెలిచిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతి సభ్యుడు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రథమ కర్తవ్యంగా ఎంపీలు పనిచేయాలన్నారు. ప్రజల సుస్థిరతకు పట్టం కట్టారని.. విశ్వమంతా దేశంలో జరిగిన ఎన్నికలను పరిశీలించిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తోందన్నారు. అభివృద్ధిలో తమ ప్రభుత్వం పరుగులు పెడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
మౌలిక వసతలు కల్పలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని.. రైతలు, మహిళలు, యువత సాధికరత దిశగా ప్రభుత్వం పయనిస్తోందన్నారు. సిఎఎ ప్రకారం శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేయడం ప్రారంభించిందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే ప్రతి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దేశ ఖ్యాతిని దిగజార్చేలా ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత ఆరోగ్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. గతంలో తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలతో దేశంలో ఎన్నో మార్పులు తీసుకురాగలిగామని చెప్పారు. జీఎస్టీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాలు సులభతరమయ్యాయన్నారు. దేశ ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సుస్థిరత, నిజాయతీని నమ్మారని అన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. పంటలకు మద్దతు ధరకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
వ్వవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని.. ప్రజాక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని.. రైతుల సంక్షేమం కోసం అతి పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో అడవుల విస్తరణ ఉంటుందన్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్తో దేశ ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తున్నామని, చిన్నరైతులకు పీఎం సమ్మాన్ నిధి ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో గ్రాణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని, పెట్టుబడులు, ఉపాధికల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రజలు విశ్వసించారని.. ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచవ్యాప్త డిమాండ్ మేరకు భారత్ ఉత్పత్తులు అందిస్తోందన్నారు. ఆరోగ్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉందని తెలిపారు.
తమ దేశం వేగంగా పురోగతి సాధిస్తోందన్నారు. దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. నీట్, నెట్ పేపర్ లీకేజీపై ఆమె తన ప్రసంగంలో మాట్లాడుతూ.. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. పేపర్ లీకేజీపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోదంన్నారు. నిందితులపై చర్యలు తప్పవన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ప్రభుత్వ జవాబుదారీతనాన్ని తెలియజేస్తుందన్నారు. అలాగే దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల తర్వాత దేశంలో సంపూర్ణ మెజారిటీతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు మూడోసారి విశ్వాసం చూపించారని తెలిపారు. ప్రతి భారతీయుడి ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నెరవేర్చగలదని రాష్ట్రపతి తెలిపారు.
18వ లోక్సభ అమృత కాలం ప్రారంభ సంవత్సరాల్లో ఏర్పడిందన్నారు. త్వరలోనే ఈ ప్రభుత్వం తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రభుత్వ ఆర్థిక విధానాలను తెలియజేయడంతో పాటు అనేక కీలక నిర్ణయాలు బడ్జెట్లో ఉండే అవకాశాలున్నాయనే సంకేతాలను రాష్ట్రపతి తన ప్రసంగం ద్వారా ఇచ్చారు. దాదాపు 64 కోట్ల మంది వోటర్లు తమ కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వర్తించారన్నారు. ఈసారి మహిళలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. కశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో వోటింగ్ నమోదైందని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగిస్తున్నంత సేపు ప్రధాని మోదీ సహా అధికార సభ్యులు బల్లలు చరిచారు.





