తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ  అంటే  కేంద్ర ప్రభుత్వంలోని బిజెపి నాయకులకు ఒక విధమైన అసూయ ఎందుకంటే ఈ ప్రాంతం ప్రకృతి వనరులతో ఖనిజాలతో సుసంపన్నంగా విరాజిల్లుతున్నది. ఇక్కడ  పచ్చటి పంట పోలలాతో కాలేశ్వరం జల గంగతో  సాగు త్రాగునీటి తో సుభిక్షంగా ఉండడమే వీరికి మింగుడు పడడం లేదు. ప్రకృతి సంపదలు ఎంతగా ఉన్నా పారిశ్రామికంగా, విద్య, వైద్య,  రోడ్డు, రైలు రవాణా మొదలగు రంగాలలో విషయాలలో ప్రజలకు అవసరాలు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి‌ దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయ సౌకర్యాలు అవసరం మరియు కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా తెలంగాణ దేశంలోని 29వ రాష్ట్రం. కానీ ప్రధానమంత్రి మోడీ తెలంగాణ మీద ఒక విధమైన కక్ష సాధింపు చేస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటు కావడమే  అసలు బిజేపికి ఇష్టం లేదు. ప్రధాని మోడీ  తెలంగాణకు వచ్చిన ప్రతిసారి మోసపూరిత  మాటలు స్పష్టంగా ప్రజలకు అర్ధమైపోతున్నవి. నిజాలు బిజేపి నేతలు మాట్లాడలేరు. కనీసం చెప్పే అబద్దాలు కూడా నమ్మశక్యంగా లేవు.  కొత్త రాష్ట్రం తెలంగాణ సాధించుకొని, అరవైఏళ్లపోరాటం ఫలించి, నవ శకానికి నాంది వేస్తున్న తరుణంల తెలంగాణను  అభినందించవలసిన ప్రధాని మోడీ, తల్లిని చంపి బిడ్డను బతికించారని తన మనసులోని మాటను వెల్లగక్కినాడు.  శుభం పలకమంటే ఏదో పలికినట్లు ఉన్నది తెలంగాణ ఏర్పాటైన రోజు నుండి  ప్రతి అవకాశాన్ని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించేందుకు ఉపయోగించుకొనే మోడీకి తెలంగాణ పట్ల ఆదరణ చూపడం లేదు అందుకే ఆయన చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన ఉండదు. ఎప్పుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటారు. రాష్ట్ర బిజేపి నాయకులకు ఈ విషయం అర్ధం కావడం లేదు. మోడీ మాయలో  బిజేపి నాయకులు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి  ఒకప్పటి ఆరాధ్యుడైన లాల్ కృష్ణ అద్వానీ కూడా తెలంగాణ పట్ల చివరి ప్రయత్నం గా రాజధాని ఉన్న ప్రాంతానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఎందుకని  తన వ్యతిరేకతను తెలియజేసినాడు .

మన  భారత దేశంలో పేద ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి. కాని సంపన్న వర్గాలకు  కొమ్ము కాచే నాయకత్వం పేదలను ఆదుకుంటారని నమ్మడం కష్టతరమైన విషయం. దేశంలో గత ప్రభుత్వాలు అనేక స్పీడ్‌రైళ్లను ప్రవేశపెట్టారు. దేశంలో పేదలకు కూడా సంపన్నులలాగా సౌకర్యాలు అందాలని గతంలో గరీభ్‌రధ్‌ రైలు ప్రవేశపెట్టారు. దేశమంతా ఈ రైళ్లు  ప్రజలందరికీ సేవలందిస్తున్నాయి.  వీటిని ఒకేసారి ప్రవేశపెట్టినారు. ప్రస్తుతం వందేభారత్‌ పేరుతో ప్రవేశపెట్టిన రైళ్ల అన్నింటిని  ప్రధాన మంత్రి మోడీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించినారు.  రైల్వే శాఖ క్యాబినెట్ మంత్రి లేదా సహాయ మంత్రి ప్రారంభించవలసిన రైళ్లను దేశ ప్రధాని ప్రారంభించడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.  భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి తిరుపతి వెంకన్నసన్నిధికి వందేభారత్‌తో అనుసంధానం చేస్తున్నామని పెద్ద హాస్యాస్పదంగా ఉన్నది.

ఇంతవరకు తిరుపతికి హైదరాబాద్‌ నుంచి రైల్వే లైన్ లేనట్లు  ఇప్పుడే క్రొత్తగా లైన్‌ వేసి  రైళ్ళు నడుపుతున్నట్లు చెప్పుకోవడం ప్రజలు వింతగా చూస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందేభారత్‌ రైలు తెలంగాణ ప్రజలకు కోసం వేసింది కాదు.  ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చడం కోసం మాత్రమే. ఈ వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ తెలంగాణలో ఒక్క నల్గగొండ  మీదుగానే ప్రయాణం చేస్తుంది. అది దాటితే మొత్తం ఆంధ్రాలోనే ప్రయాణిస్తుంది. ఆదిలాబాద్‌, సిర్పూర్, ఖమ్మం , వికారాబాద్ ప్రాంత ప్రజలు వందేభారత్‌ రైలులో తిరుపతికి వెళ్లాలంటే సికింద్రాబాద్‌కు రావలసి ఉంటుంది. కాజీపేట, వరంగల్‌ మీదుగా ఈ రైలు నడిపిస్తే  కొంతలో కొంత తెలంగాణుకు మేలు జరిగేది. కరోనా సమయంలో రద్దు చేసిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చాలావరకు ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైలుగా మార్చి ప్రజలపై అధిక భారం మోపుతున్నారు ఇంతేగాక అనేక హాల్ట్ లను ఎత్తివేసి ప్రయాణికులను ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా కాజీపేట బలహర్ష సెక్షన్   లో సింగరేణి, రామగిరి, నాగపూర్ ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైలులుగా మార్చి పలు హాల్టులను రద్దు చేసినారు. ఫలితంగా పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్‌  రైల్వే స్టేషన్‌ ను తీర్చిదిద్దే ప్రతిపాదన బిజేపి ప్రభుత్వానిది కాదు.
గత కాంగ్రెసు ప్రభుత్వం నిర్ణయించినదే .తెలంగాణ మీద మోడీ ప్రేమతో చేసిందే ఏమాత్రం కాదు. దక్షిణమధ్య రైల్వే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సమకూర్చిపెడుతోంది. ఇదేదో బిజెపి ప్రభుత్వం చేస్తున్నట్టు గొప్పలు చెబుతున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు శంకుస్ధాపన  పెద్ద నాటకం. అక్కడ భవనం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యింది. ఓపి కూడా పనిచేస్తోంది.  ఇప్పటికే వైద్య సేవలు అందిస్తున్నది. కాకపోతే కేంద్రానికి, బిజేపి పార్టీకి హఠాత్తుగా బీబీనగర్‌ ఎయిమ్స్‌ మీద ప్రేమ తెలంగాణ ప్రజల కోసం కాదు, అక్కడ ఉన్న భూములు ధరలు  పెంచుకొనడకోసం .  ఎయిమ్స్‌ స్దాయి దవఖానకు వెయ్యికోట్లు వెచ్చిస్తామని మాటలు చెప్పడం కాదు, ఎప్పటిలోగా అన్ని సౌకర్యాలు పూర్తి చేస్తారో చెప్పడం లేదు. రైతులు వాడే కరెంటుకు మీటర్లు పెట్టమంటారు దీనికి వ్యతిరేకంగా రైతుల కోసం ఎంత దూరమైన వెళ్లి ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టనని చెప్పడం మోడీకి నచ్చడం లెదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వేల కోట్లు విడుదల చేయకుండా ఆపినారు.

ఇటీవల వరంగల్‌లో ప్రధాని ప్రసంగం చాలా విషయాల్లో చాలా విరుద్ధంగా ఉంది.    రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో ఉన్నది అని తన ఉపన్యాసంలో చెప్పినాడు. అయితే  ప్రధానమంత్రిగా ఎందుకు చర్య తీసుకోవడం లేదు. కేసీఆర్ అవినీతికి పాల్పడి ప్రభుత్వ నిధులను కొల్లగొడుతుంటే, ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ఎట్లా ప్రారంభిస్తారు.

ప్రధాని మోడీ ఉపన్యాసం అంత కేసీఆర్ ని నిందించడమే.
కోచ్‌ ఫ్యాక్టరీ స్థానంలో వ్యాగన్‌ వర్క్‌షాప్‌, వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీ కాదు, కేవలం వర్క్‌ షాప్‌ మాత్రమే.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని ఎందుకు తుంగలో తొక్కినారు.గవర్నర్‌ నెలలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉంచడం  సహేతుకముగా లేదు మరియు రాజ్యాంగ విరుద్ధం కూడా.బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. గిరిజన యూనివర్సిటీ లేదు. మెడికల్‌ కాలేజీలు ఇవ్వలేదు.  కనీసం ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వడంలేదు. కాని రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. గతంలో మిషన్‌ భగీరధ ద్వారా ఇంటింటికీ నీళ్లిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వచ్చిన ప్రధాని మోడీ తెలంగాణకు ఒక్క రూపాయి ప్రకటన  చేయలేదు.

కానీ ప్రధాని రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని  చెప్పడం వింతగా ఉన్నది. ఇక దేశంలో 80 కోట్ల మందికి రేషన్‌ ఇచ్చి ఆదుకుంటున్నామని ఓవైపు పదే పదే చెబుతూ, దేశాన్ని ధనిక దేశంగా మార్చుతున్నామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. 130 కోట్ల జనాభాలో 80 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నామంటే దేశంలో పేదరికం తగ్గనట్లే అన్న విషయం  తెలియకుండా  మాట్లాడడం విడ్డూరం. బిజేపి నేతలు ప్రధాని మోడీ సభకు ముఖ్యమంత్రి రాలేదని చెప్పడమంత పచ్చి అవకాశవాద రాజకీయాలు మరెక్కడా ఉండదు కూడా ప్రధాన మంత్రి మోడీ రాష్ట్ర పర్యటనలో అధికారిక సభ ఏర్పాటు చేస్తే, ఎక్కడైనా బిజేపి నాయకులు వివిఐపి పాసులు జారీ చేస్తారా! ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. తరలించినా పార్టీ పరమైన అంశాలు అక్కడ కనిపించవద్దు. పైగా అధికారిక కార్యక్రమంలో మోడీ రాజకీయ పరమైన వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు ఎవరిని మోసం చేయానులనుకుంటున్నారు. బిజేపి నేతలు ఎన్ని నాటకాలు ఆడిన తెలంగాణ ప్రజలు వారని నమ్మే స్థితిలో లేరు. ఆ పార్టీకి తెలంగాణలో స్ధానమే ఉండదు.

దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్
సింగరేణిభవన్ హైదరాబాద్
9849592958

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *