రేవంత్ రెడ్డి గ్లోబల్ ప్రచారం నమ్మవొద్దు
వలసలు వెళ్లే జిల్లా కావాలా వలసలు వొచ్చే జిల్లా కావాలా
కెసిఆర్ పథకాలు ప్రతి ఇంటికి అమలయ్యాయి
వొచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా 14 స్థానాల్లో బిఆర్ఎస్ జండా ఎగరాలి
తెలంగాణ రాష్ట్ర పథకాలను దేశం అనుసరిస్తున్నది
: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు
మహబూబ్నగర్, ప్రజాతంత్ర,మే 27: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో నడుస్తూ ముందరకి వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గ్లోబల్ ప్రచారం ప్రజలు నమ్మవొద్దని రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్మెయిలర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హయాంలో సంక్షేమం అభివృద్ధి చేయలేని దద్దమ్మలు నేడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని మాట్లాడు తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం మహబూ బ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో 30 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల హాస్పిటల్ ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జడ్చర్ల వంద పడకల హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ముఖ్యంగా ఎమర్జెన్సీ, ఐసీయూ, డయాలసిస్, గైనిక్, పీడియాట్రిక్ ,ఐసి యు వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొట్టమొదటి వైద్య కళాశాల మహబూబ్నగర్ కు వచ్చిందని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 జిల్లాలకు 5 మెడికల్ కళాశాలలు, ప్రతి నియోజకవర్గంలో 500 పడకల హాస్పిటల్స్ రానున్నాయని ఆయన తెలిపారు.
రాష్ట్రం సాధించిన తర్వాత కెసిఆర్ హయాంలో గత సంవత్సరం 8 మెడికల్ కళాశాలలు, ఈ సంవత్సరం 9 మెడికల్ కళాశాలలు వచ్చాయని, స్వతంత్రం వచ్చినప్పటి నుండి 70 ఏళ్ల వరకు 20 మెడికల్ కళాశాలలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 55 పెరిగిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేట, అలంపూర్, కొల్లాపూర్, కొడంగల్ ,షాద్నగర్ నియోజకవర్గం కేంద్రాలలో వంద పడకల హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్స్ ఉన్నాయని ,మహబూబ్నగర్ జిల్లాకు ఫిషరీస్ కళాశాల తో పాటు వ్యవసాయ కళాశాల కూడా వచ్చిందని, ప్రాజెక్టులు పూర్తి అయితే జిల్లా సస్యశ్యామలమవుతుందని ,పాలమూరు నుండి గతంలో వలస వెళ్లిన వారు ఇప్పుడు తిరిగి వాపస్ వలస వస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, మెడికల్ కళాశాలలు, కంటి వెలుగు ,పెన్షన్ వంటి పథకాలను దేశం అనుసరిస్తున్నదని, త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి వచ్చే జూలై, ఆగస్టు నాటికి సాగునీటిని అందిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందని ఇల్లే లేదని మంత్రి స్పష్టం చేశారు. నవాబ్ పేటకు ముప్పై పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడం జరుగుతున్నదని, 70 ఏళ్లలో జిల్లాలో 30 హాస్టళ్లు కూడా లేవని, ఇప్పుడు వాటి సంఖ్య 110 కి చేరిందని, మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు తాగునీరు అందిస్తున్నామని, హాస్పిటల్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రతి జిల్లాకు వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, దేశంలో 50% పైగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ప్రాజెక్టులను పూర్తయితే నెంబర్ వన్ స్థానంలో ఉంటామని అన్నారు. రెండు లక్షల నుండి 8 లక్షలు ఎకరాలు సాగు చేసే స్థాయికి వచ్చామని, దేశంలోనే ఇన్నిపథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, జిల్లా నుండి 100% పేదరికం నిరక్షరాస్యత, అసమానతలు తొలగిస్తామని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్చర్ల శాసనసభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని, 100 పడకల హాస్పిటల్స్ ఐసీయూ తో పాటు ఎమర్జెన్సీ , డయాలసిస్ వంటి సౌకర్యాలని కల్పించామని, పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, సోమవారం నుండి వందపడకల హాస్పిటల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని, తెలంగాణ రాకముందు జడ్చర్ల ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని సబ్ సెంటర్లను పల్లెదవకానలుగా చేసి పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేయడం జరిగిందని,జడ్చర్ల నల్లచెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చడం జరిగిందని, మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు తాగునీరు అందిస్తున్నామని, నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు బి టి రోడ్లు వేశామని, నవాబ్ పెట్ మండలానికి ముప్పై పడకల హాస్పిటల్ని మంజూరు చేయాలని కోరారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ కోడగల్ యాదయ్య, జిల్లా కలెక్టర్ జి.రవినాయక్, ఎస్పీ కే. నరసింహ, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాలియనాయక్, టిఎస్ ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రవీందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




