చాణక్య నీతి కి ప్రతిరూపం వై. యస్‌.

‌నేడు రాజశేఖర్‌ ‌రెడ్డి జయంతి

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 – సెప్టెంబర్‌ 2, 2009) ఆం‌ధ్ర ప్రదేశ్‌ 16‌వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌  ‌పార్టీ నాయకునిగా, ప్రత్యేక గుర్తింపు పొందిన జన హృదయ నేత. తల పండిన నేతలను తల దన్నిన వ్యూహ రచనా  దురంధరుడు ఆయన. మునిగి పోతున్న కాంగ్రెస్‌ ‌నావను ఒంటి చేత్తో దరికి చేర్చిన రథ సారథి ఆయన. రాజకీయాలకు సరి కొత్త అర్థం చెప్పిన చాణక్యుడు వై.యస్‌…‌రాజశేఖర్‌ ‌రెడ్డి 1949 జూలై 8న జమ్మల మడుగులోని సి.ఎస్‌.ఐ. ‌కాంప్‌బెల్‌ ‌మిషన్‌ ఆసుపత్రిలో జన్మించారు.  ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్‌ ‌జాన్స్ ‌పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వ విద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా పుచ్చు కున్నారు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల (యెస్‌.‌వి.ఆర్‌.ఆర్‌), ‌తిరుపతి నుంచి హౌస్‌సర్జన్‌ ‌పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్‌.‌వి.ఆర్‌.ఆర్‌ ‌కళాశాలలో పని చేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్‌ ‌సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తరువాత కొద్ది రోజులపాటు జమ్మల మడుగులోని సి.ఎస్‌.ఐ. ‌కాంప్‌బెల్‌ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశారు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్‌.‌రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశారు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్‌ ‌కళాశాల, డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న సింహాద్రి పురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది.

కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగా, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్‌ ‌కాంగ్రేస్‌ ‌కమిటీ అధ్యక్షులుగానూ పనిచేశారు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. తెలుగు దేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్‌ ‌లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్‌. ‌నిత్య అసమ్మతి వాదిగా పేరు పడ్డారు. కాంగ్రెస్‌ ‌ముఖ్య మంత్రులు అందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్య పడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌ ‌రెడ్డి, కోట్ల విజయ భాస్కర్‌ ‌రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపారు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డిని పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాదు నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్‌ ‌రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించు కోగలిగారు. రాజకీయాల్లో ముక్కు సూటి తనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి నిలువెత్తు నిదర్శనం. ఆంధ్ర ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షులుగా వై.ఎస్‌.‌రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశారు.

తొలిసారి 1983 నుంచి 1985 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో ప్రతిపక్ష నేత గానూ వ్యవహరించారు. 2003 వేసవి కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాద యాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్‌.‌కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడింది. 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వై.ఎస్‌.‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశారు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీని వై.ఎస్‌.‌రాజశేఖర్‌ ‌రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించిపెట్టాడు.  అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేశారు.

వై.యస్‌. ‌రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్‌ ‌సౌత్‌ ఇం‌డియా (సి.ఎస్‌.ఐ) అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంటు క్రైస్తవుడు. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోనూ, మరలా 2009లోనూ కుటుంబ సమేతంగా బెత్లహాము యాత్రకు వెళ్ళి వచ్చాడు. క్రైస్తవులైనా పారంపరికంగా వచ్చిన హిందూ సంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి తిరుమలను అనేకమార్లు సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పూజలు చేశారు. ఆయన అల్లుడు అనిల్‌ ‌కుమార్‌ ‌మత ప్రచారకులు. బ్రాహ్మణుడైన అనిల్‌ ‌కుమార్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి కూతురు షర్మీలాను పెళ్ళి చేసుకున్న తర్వాత క్రైస్తవం స్వీకరించి మత ప్రచారకు డయ్యారు. సెప్టెంబర్‌ 2, 2009 ‌న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలు దేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగి పోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్‌.‌తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్‌ ‌ప్రమాదంలో మరణించారు.  తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకో లేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు.
రాజ శేఖర్‌ ‌రెడ్డి ఎన్నో  పదవులు అనుభవించారు.
1975లో యవజన కాంగ్రెస్‌ ‌కార్యదర్శిగా నియామకం.
1980లో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా నియామకం.
1982లో రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్‌ ‌శాఖా మంత్రి పదవి.
1982లో రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం
1983లో పిసిసి అధ్యక్షులుగా నియమించబడ్డారు (1985 వరకు).
1998లో రెండోసారి పిసిసి అధ్యక్షులుగా నియామకం (2000 వరకు) 1999లో శాసనసభ ప్రతిపక్ష నేతగాబీ 2004లో ఆంధ్ర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి అయ్యారు.
2009లో రెండో పర్యాయం ఆంధ్ర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి అయ్యారు.
ఇక 1978లో పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యులుగా
1983లో: పులివెందుల నుంచి రెండోసారి శాసన సభ్యులుగా
1985లో పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసన సభ్యులుగా హాట్రిక్‌ ‌విజయం సాధించారు.
1989లో కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లొకసభ సభ్యులుగా
1991లో కడప నియోజకవర్గం నుంచి రెండోసారి
1996లో కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్‌ ‌సాధించారు.
1998లో కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించారు.
1999లో: పులివెందుల నుంచి నాలుగవసారి శాసన సభ్యులుగా
2004లో పులివెందుల నుంచి ఐదవసారి శాసన సభ్యులుగా విజయం సాధించారు.
2009లో పులివెందుల నుంచి రెండోసారి హాట్రిక్‌ ‌విజయం, శాసన సభ్యులుగా ఆరవసారి గెలుపొందారు.

 – రామకిష్టయ్య సంగనభట్ల…
    9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *