- వరద పోటెత్తినప్పటికి ప్రాణాపాయం లేకుండాప్రజలను కాపాడాం
- తగ్గుముఖం పట్టినందున పారిశుధ్య వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి
- విలేఖరుల సమావేశంలో కలెక్టర్ అనుదీప్ , రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్• హనుమంతరావు, ప్రజారోగ్య సంచారకులు డాక్టర్ శ్రీనివాస్
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : గోదావరి వరద భయానక వాతావరణం సృష్టించినప్పటికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా వరదలను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలను కాపాడుకున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్• హనుమంతరావు, ప్రజారోగ్య సంచారకులు డాక్టర్ శ్రీనివాసరావులు అన్నారు. మంగళవారం నాడు ఐటిడిఏ సమావేశం హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వరదలు తగ్గుముఖం పట్టినందున అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చినప్పటికి ముంపు భారిన పడిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగామని చెప్పారు. 8 మండలాల్లో 240 గ్రామాలకు విద్యుత్ సేవలు నిలిచిపోయాయని ,వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో 230 గ్రామాలకు మళ్ళీ విద్యుత్ పునరుద్దరించినట్లు తెలిపారు. మిగిలిన 10 గ్రామాలకు మంగళవారం సాయంత్రం 5గంటలకు విద్యుత్ సరఫరా ఇవ్వనున్నట్లు తెలిపారు. 71.4 అడుగులు గోదావరి వరద వచ్చినప్పటికి సింగరేణీ సహకారంతో 1800 హెచ్పి మోటార్లు ఏర్పాటు చేసి వరదనీటిని తొలగించినట్లు చెప్పారు. ఇంటెక్వెల్ రెండుచోట్ల ముంపుకు గురైతే పునరుద్దరించటం జరిగిందని తెలిపారు.
1300 గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయిందని ,1100 గ్రామాల్లో మళ్ళీ మంచినీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మిగిలిన 200 గ్రామాల్లో బుధవారం నాడు మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. వరదముంపు తగ్గినందున ఇండ్లకు వెళ్ళేవారికి నిత్యవసర వస్తువులతో పాటు 25 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు,నూనె ఇతర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు అదికార యం•త్రాంగం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో 4,100 మంది పారిశుధ్య కార్మికులతో పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. 1986 తరువాత పెద్దఎత్తున వరద వచ్చినప్పటికి సమర్ధవంతంగా ఎదుర్కున్నామని తెలిపారు. 45 గ్రామా పంచాయితీలు వరదముంపు గురయ్యాయని తెలిపారు.దోమల వ్యాప్తి జరుగకుండా ఉండేందుకు హైద్రాబాద్ నుండి 9ఫాగింగ్ యంత్రాలతో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు తెలిపారు.
అంతేకాకుండా పట్టణంలో 30 యంత్రాలతో ఫిగింగ్ కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఆయిల్ బాల్స్ వేస్తునట్లు తెలిపారు. 120 ట్రాక్టర్లు మరియు సింగరేణీ టిప్పర్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. వరదల వలన అంటురోగాలు వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 10276 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.24 గంటలు పనిచేసే విధంగా 040 24651119 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరద సమయంలో 106 మంది గర్భిణీ మహిళలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. 60 మందికి స్పెషల్ చికిత్సలు నిర్వహించి ప్రసవం చేయగా 36 మంది సాధారణ ప్రసవం చేసారని తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. 24 గంటలు అత్యవసర సేవల నిర్వహణకు 108 వాహనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 297 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక వైద్య క్యాంపులు నిర్వహిస్తునట్లు తెలిపారు. నిల్వ ఉన్న ఆహార పదార్ధాలు తినవద్దని, వేడిగా ఉన్న వస్తువులను తినాలని సూచించారు. ప్రతీఒక్కరు మంచినీటిని మరుగపెట్టి వడకట్టిన తరువాత తాగాలని సూచించారు.




