ఏప్రిల్ 1న కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశం
దేశం ముందు ఆప్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం
ఇదంతా రాజకీయ కుట్ర అన్న కేజ్రీవాల్
న్యూదిల్లీ,మార్చి 28: దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ఈడీ కస్టడీని దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 1వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం వెల్లడిరచింది. గతంలో విధించిన ఏడు రోజుల కస్టడీ గురువారంతో ముగియడంతో ఈడీ అధికారులు ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు.
మద్యం కేసులో కేజీవ్రాల్ను ఇంకా విచారించేందుకు మరో ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరగా.. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 11గంటలకు తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు. కేజీవ్రాల్ను విచారించే సమయంలో ఐదు రోజులు స్టేట్మెంట్లను రికార్డు చేశామని.. ఆయన దాటవేత సమాధానాలను చెబుతున్నారని ఈడీ ఆరోపించింది.
డిజిటల్ పరికరాల పాస్వర్డ్లను ఆయన వెల్లడిరచలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అదే సమయంలో మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాలను సైతం రికార్డు చేసినట్లు తెలిపింది. అంతకముందు కేజీవ్రాల్ స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ కేసులో తన పేరును నలుగురు సాక్షులు మాత్రమే ప్రస్తావించారని.. ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఆ వాంగ్మూలాలే సరిపోతాయా? అని ‘ఈడీ’ని ఉద్దేశించి ప్రశ్నించారు.
దేశం ముందు ‘ఆప్’ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ఈ సందర్భంగా కేజీవ్రాల్ అన్నారు. మార్చి 21న కేజీవ్రాల్ను ‘ఈడీ’ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దిల్లీ మద్యం విధానం కేసు ’రాజకీయ కుట్ర’ అని.. దీనికి ప్రజలే సమాధానం చెబుతారని సీఎం కేజీవ్రాల్ పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో నేడు హాజరుపరిచారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్తున్న సమయంలో అక్కడున్న విలేకరులతో ఆయన ఈవిధంగా వ్యాఖ్యానించారు.





