జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్కు మంత్రి కేటీఆర్ నివాళి
నేతల కడసారి వీడ్కోలు…అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
ములుగు, ప్రజాతంత్ర, జూన్ 12 : తెలంగాణ ఉద్యమ సమయం నాటి నుండి రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి చెందే వరకు రెండు దశాబ్దాలుగా సీఎం కేసీఆర్ అప్పగించిన ప్రతీ పనిని విజయవంతం చేయడంలో ఒక సైనికుడిలా పనిచేసిన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మంచి పేరు సంపాదించుకున్న నేతగా ఎదిగారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, ఆదివారం అకాల మరణం చెందగా సోమవారం ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామంలో నిర్వహించిన జగధీష్ అంత్యక్రియలకు మంత్రి కేటీఆర్ హాజరై ఘన నివాళులర్పించారు. ఆయనతో పాటు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్,పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వర్ రెడ్డి లతో కలసి కుసుమ జగదీష్ పార్థీవ దేహానికి పూలమాలలువేసి ఘన నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మంత్రి కెటిఆర్ హైద్రాబాద్ నుండి ప్రత్యేక హెలిక్యాప్టర్లో ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్లతో కలిసి ములుగుకు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రత్యేక కాన్వాయితో మల్లంపల్లికి చేరుకుని జగదీశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మంత్రి కెటిఆర్ విలేఖరులతో మాట్లాడుతూ…ఇటీవల జిల్లాలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో తనతో పాటు చురుగ్గా పాల్గొన్న జగదీశ్ అకస్మాత్తుగా మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. రెండు దశాబ్దాలుగా కేసీఆర్ అప్పగించిన ప్రతీ పనిని నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా పనిచేసిన సోదరుడు జగదీష్ అకాల మరణం పార్టీతో పాటు ప్రజానికానికి తీరని లోటని అన్నారు. చిన్న వయస్సులో చురుకైన నాయకుడిని కొల్పొవడం ములుగు జిల్లా ప్రజానికానికి తీరని లోటని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ పిలుపునిచ్చిన ప్రాణాలకు సైతం తెగించి గొప్పగా పని చేసి విరోచితంగా, ధీరోదాత్తంగా పోరాడిన నాయకుడు జగదీశ్ అని తెలిపారు. ఈ పరిస్థితిలో మల్లంపల్లికి వొచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించాల్సి రావడం ఎంతో దురదృష్టకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు రావడం తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని అన్నారు. జగదీశ్ కుటుంబానికి హృదయ పూర్వకంగా తనతో పాటు కేసిఆర్ తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. జగధీశ్ కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమంలో పేరు మాత్రమే సంపాదించుకున్న నేత జగధీష్ అని, ఆస్తి, పాస్తులు కూడబెట్టుకోలేని గొప్ప నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం నిర్వహించిన జగదీశ్వర్ అంత్యక్రియల్లో భాగంగా మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ కవితలు జగదీశ్వర్ పార్థివ దేహానికి స్నానం చేయించారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పల్లా రాజేశ్వర్రెడ్డి, సత్యవతిరాథోడ్లు జగదీశ్వర్ పాడెను మోసారు. డప్పు చప్పుళ్ళ మధ్య జగధీశ్వర్ పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధి చేశారు.

జగదీశ్వర్ అంత్యక్రియల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఏర్పాట్లను పర్యవేక్షించగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. జగదీశ్వర్ అంతిమ యాత్రలో ఎమ్మెల్సీ లు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, తాత మధు సుధన్, ఎంపీలు రంజిత్రెడ్డి, భాల్క సుమన్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, వరంగల్ , మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఆంబోతు బిందు, దనసరి అనసూయ సీతక్క, ములుగు శాసనసభ సభ్యులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరురి రమేష్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, గౌష్ ఆలం ఎస్పీ, ఐటీడీఏ పీవో అంకిత్, బడే నాగజ్యోతి, వైస్ చైర్ పర్సన్,జిల్లా పరిషత్,వి. ప్రకాష్ రావు, చైర్మన్, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ, వై సతీష్ రెడ్డి, చైర్మన్, టీఎస్ రెడ్ కో, బీసీ కమీషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణమోహన్రావు,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, హనుమకొండ,ములుగు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, అజీజ్ ఖాన్,పోరిక గోవిందు నాయక్, జడ్పిటిసిలు సకినాల భవాని, గై రుద్రమదేవి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,మాజీ ఎంపీ సీతారాం నాయక్, అదనపు కలెక్టర్ రెవిన్యూ వై వి గణేష్, డి ఆర్ ఓ రమాదేవి, సిపిఓ ప్రసూనరాణి, డిపి ఓ వెంకయ్య, డిపిఆర్ఓ రఫిక్, ములుగు తహసిల్దార్ ఎం సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఇక్బాల్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది, ములుగు జిల్లాతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయన అభిమానులు, స్నేహితులు అధిక సంఖ్యలో తరలివచ్చి కడసారి వీడ్కొలు తెలిపారు.




