ఊరడింపు పథకాలతో కడుపు నిండదు
బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్ విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఏ పథకం ప్రజల కడుపు నింపదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తొమ్మిది రోజులుగా విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీపై పాతబస్తీలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. బడా వ్యాపారులకు మాత్రమే ఓవైసీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. మతం పేరుతో మజ్లీస్ రాజకీయాలు చేస్తూ పాత బస్తీ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు.
అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు మజ్లీస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరుతుందన్నారు. ఉచితాల పేరుతో కాంగ్రెస్ వోట్లు దండుకునే కార్యక్రమం చేపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో గారడీ చేసి అధికారంలోకి వొచ్చాక ప్రజలను మభ్య పెడుతుందని ఆరోపించారు. లబ్ది దారులను తగ్గించేందుకు ప్రభుత్వం షరతులు విధిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం పథకాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్ రూపు రేఖలను మారుస్తామని లక్ష్మణ్ చెప్పారు.





