లేదంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంను ఉచితంగా అమలు చేయాలని, లేదంటే మోసపూరిత హావిూ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందింస్తూ.. హావిూల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్కు అలవాటుగా మారింతన్నారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పి..ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైందన్నారు. నో ఎల్ఆర్ఎస్`నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి..ఇప్పుడు ఫీజు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.




