ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ఎన్నికలు వొచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి చేకూరేలా కేసీఆర్‌ పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్‌ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ…ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే అని విమర్శించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాగర్‌ డ్యామ్‌ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవు. సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు..రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు యత్నించారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమే అని చెప్పారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్‌ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుందన్నారు. వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత కాంగ్రెస్‌ది అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *