- కవితపై వ్యాఖ్యలకు నిరసనగా దాడి..దిష్టిబొమ్మ దగ్ధం
- ఖబర్దార్ అంటూ ఎంపి అర్వింద్కి హెచ్చరికలు
- కెసిఆర్, కెటిఆర్, కవిత ఆదేశాలతో దాడులన్న అర్వింద్
- ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఘటనపై ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. శుక్రవారం ఆయన ఇంటిపై దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ రెచ్చిపోయారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రస్తుతం ఎంపీ అర్వింద్ నిజామాబాద్లో ఉన్నారు. సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వి•డియా సమావేశంలో మాట్లాడిన ఆయన..దిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధమున్న కవితకు బీజేపీలో చోటు లేదని అన్నారు. ఆమెను తీసుకొస్తామన్న వారిని కూడా ఉపేక్షించమని చెప్పారు. అలా తీసుకొచ్చే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను డిమాండ్ చేస్తానని అర్వింద్ చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కవిత టచ్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకే హైదరాబాద్ లోని తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు.
ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టించారని వాపోయారు. ఇంట్లో ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ పీఎంఓ, ప్రధాని నరేంద్రమోడీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ కార్యకర్తలు కేవలం ధర్నాకు సిద్ధమైతేనే అరెస్ట్ చేసి కేసులు నమోదుచేసే పోలీసులు మరి ఇప్పుడేం కేసులు బుక్ చేస్తారో చెప్పాలని అన్నారు. ఈ దాడికి ప్రధాన కారకురాలైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదుచేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం దీనికి సంకేతమని అన్నారు.ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.