మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
నేడు సరస్వతీదేవిగా అలంకారం
విజయవాడ, అక్టోబర్ 1 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఆరోరోజు శనివారం దుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
అనంతరం మంత్రిచే ప్రత్యేకపూజలు చేయించారు. ఉత్సవాలలో కీలకమైన మూలానక్షత్రం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో అందుకు తగ్గట్లుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆదివారం అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమివ్వనున్నారు.




