తొలి వోటు వేసిన మంత్రి కెటిఆర్
వరంగల్ నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లి వోటేసిన సిఎం కెసిఆర్
తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్
పొరపాటున యశ్వంత్కు బదులుగా ముర్ముకు వోటు వేసిన కాంగ్రెస్ ఎంఎల్ఏ సీతక్క
పార్లమెంట్లో వోటేసిన టిఆర్ఎస్ ఎంపిలు
పార్లమెంట్ భవనంలో వోటేసిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎంపిలు
మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్లు వోటు హక్కు వినియోగించుకోలేదు. కొరోనా కారణంగా హాస్పిటల్లో చేరడంతో గంగుల కమలాకర్ వోటు హక్కు వినియోగించుకోలేకపోగా విదేశాల్లో ఉన్న కారణంగా చెన్నమనేని వోటేయలేదు.
రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సందర్భంగా మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన వోటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్తో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వోటు వేశారు. వరంగల్ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్, మంత్రులు సత్యవతి, హరీష్ రావులతో కలసి నేరుగా అసెంబ్లీకి వొచ్చి వోటేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అనుకోకుండా తన వోటును రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బదులుగా ముర్మకు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు వోటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా వోటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ పొరపాటున మొదటి ప్రాధాన్యత వోటును సీతక్క ముర్మూకు వేసుకుంది. అయతే ఇంకా బ్యాలెట్లో వోటు వేయకముందు ఆర్వోను కొత్త బ్యాలెట్ పత్రం కోసం అభ్యర్థించగా అందుకు ఆర్ఓ సమ్మతించక పోవడంతో మళ్లీ అదే బ్యాలెట్ పేపర్ ద్వారా వోటు వేసి వొచ్చానని..ఎన్నికల కమిషన్ ఎలా పరిగణిస్తుందో చూడాలని వోటు వేసి బయటికి వొచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీతక్క పేర్కొన్నారు. అయితే సీతక్క పొరపాటున మొదటి ప్రాధాన్యతా వోటును ముర్మూకి వేశారా? లేదంటే కావాలనే అణగారిన వర్గాలకు చెందిన మహిళ అనే సానుభూతితో వోటేశారా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.
పార్లమెంట్లో రాష్ట్రపతి ఎన్నిక వోటింగ్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఏడుగురు, లోక్సభ ఎంపీలు 9 మంది తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ సోమవారం పార్లమెంట్ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్లోని రూమ్ 63లో తొలుత ప్రధాని మోదీ, ఆ తర్వాత కేంద్రమంత్రులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో నిలబడి ఎంపీలు వోటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ సహా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు వోటు హక్కును వినియగించుకున్నారు. సీక్రెట్ బ్యాలెట్ వోటింగ్ విధానంలో పోలింగ్ జరిగింది. ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు రూపొందించారు. 4809 మంది ఎలక్టోరల్ కాలేజి సభ్యులు వోటు హక్కును వినియోగించుకున్నారు. 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు వోటు •యాల్సి ఉండగా కొద్ది మంది మినహా అందరూ తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము , ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఉన్నారు. కాగా ఎన్డీఏ భ్యర్థి ముర్ముకే సంఖ్యాబలం అనుకూలంగా ఉంది. ముర్ముకు ఎన్డీఏ పక్షాలతో పాటు వైసీపీ, టీడీపీ, శివసేన, బీజేడీ మద్దతు ఇస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఈ నెల 21న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.