సీఎం చేసే అన్ని సిఫార్సులను ఆమోదించాల్సిన అవసరం లేదు

  • అభిప్రాయ బేధాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం
  • రాజ్యాంగపరంగా వ్యవహరిస్తే…వ్యక్తిగతంగా ఆపాదిస్తారా ?
  • గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌

‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ బేధాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్యాంగపరంగా వ్యవహరించి బాధ్యతలను నిర్వర్తిస్తే వ్యక్తిగతంగా ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. సీఎం చేసే అన్ని సిఫార్సులను గవర్నర్‌ ఆమోదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత కొంత కాలంగా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం గవర్నర్‌ ఓ ‌మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు.

ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సత్సంబంధాలు ఉండాలనీ, అనేక విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండటం కూడా సహజమేనన్నారు. రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించి ఏదైనా విషయంలో గవర్నర్‌ ‌నిర్ణయాలు తీసుకుంటే అది విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయంగానే భావించాలి తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్నట్లు బావించొద్దని స్పష్టం చేశారు. గవర్నర్‌ను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా చూడటం సరికాదనీ, ప్రతీ వొక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందనీ, అయినంత మాత్రాన విమర్శించడం సరికాదని పేర్కొన్నారు.

ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం, విషయమేదైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటే వివాదం చేయాల్సిన అవసరం లేదు, అది మంచి పద్దతి కూడా కాదని అభిప్రాయపడ్డారు. ఏం జరిగినా సరే వ్యవస్థలోని ప్రమాణాలను పాటించడం తప్పనిసరనీ, విషయం ఏదైనా సరే రాజ్యాంగ పరమైన నిబంధనలు పాటించినప్పుడే హుందాగా ఉంటుందన్నారు. అలా చేసినప్పుడే రాజ్యాంగానికి గౌరవం ఇచ్చిన వాళ్లమవుతామనీ, పరస్పర గౌరవం, అవగాహనతో సమస్యలు పరిష్కారముతాయని ఈ సందర్భంగా గవర్నర్‌ ‌తమిళి సై స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page