- టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై హైకోర్టులో విచారణ
- ఏప్రిల్ 11కు వాయిదా…
- కౌంటర్ అఫిడట్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్, మార్చి 21(ఆర్ఎన్ఎ) : టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కేసులో నిందితులను ఇప్పటికే సిట్ విచారిస్తుంది. ఈ క్రమంలో మంగళవారం జరిగిన హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరుపు న్యాయవాది సిట్ నివేదికను సమర్పించేందుకు సమయం కోరారు. ఈ నేపథ్యంలో రిపోర్ట్ సమర్పించేందుకు ప్రభుత్వం తరుపు న్యాయవాది ఏజీ జీఎస్ ప్రసాద్కు హైకోర్టు 3 వారాల సమయం ఇచ్చింది. తర్వాత సిట్ స్టేటస్ రిపోర్ట్ను తమకు ఇవ్వాలని హైకోర్ట్ న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి ఈ విచారణలో పిటిషనర్ తరుపు న్యాయవాది వివేక్ ధన్కా, ప్రభుత్వం తరుపు న్యాయవాది ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్ట్లో తమ వాదనలు వినిపించారు.
ఒకే మండలంలో 20 మందికి మంచి మార్కులు వొచ్చాయని, దీనిపై అనుమానాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటీషన్ పై..మార్చి 21వ తేదీ మంగళవారం వాదనలు జరిగాయి. కాంగ్రెస్ తరపున లాయర్ వివేక్ థన్కా వాదనలు వినిపించారు. పేపర్ లీకేజీ కేసు సీబీఐకి ఇవ్వాలని కోరారాయన లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశం అని.. సిట్ దర్యాప్తు కంటే సీబీఐ విచారణతోనే అసలు నిందితులు బయటకు వొస్తారని వాదించారు. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐతో విచారణ చేయించినట్లయితే వాస్తవాలు వెలుగులోకి వొస్తాయని లాయర్ వివేక్ ధన్కా కోర్టు దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ వాదనలకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కౌంటర్ వాదనలు వినిపించారు.
ఇప్పటికే కేసు విచారణ సిట్ ఆధ్వర్యంలో జరుగుతుందని..ఎంతో పారదర్శకంగా సాగుతుందని కోర్టుకు దృష్టికి తెచ్చారు. రెండు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. స్టేటస్ రీపోర్ట్ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. విచారణ ఏ దశలో ఉంది.. ఇప్పటి వరకు చేసిన విచారణ ఏంటీ అనే వివరాలను కోర్టుకు అందించాలని ఆదేశించింది. అయితే సిట్ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయాన్ని కోరారు. దీనికి హైకోర్టు మూడు వారాల పాటు సమయాన్ని ఇచ్చింది. పేపర్ లీకేజ్ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.