బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్
ప్రజాతంత్ర , హైదరాబాద్ : ఖమ్మం బిజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఉదంతంపై సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్పై సోషల్ మీడయాలో పోస్టులు పెట్టారనే కారణంతో అనేక కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. చనిపోయే ముందు మీడియాకు ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో సైతం మంత్రి పువ్వాడ వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. నిందితుడు మంత్రి హోదాలో ఉండటం, పోలీసులపైనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారనే నమ్మకం లేదనీ, మృతుడి అమ్మమ్మ సైతం రాష్ట్ర పోలీసులపైనా అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపారు.
ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని ఓ వ్యక్తికి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం మంత్రి సహా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం జరగాలంటే సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై సిబిఐ విచారణ జరిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలని ఈ సందర్బంగా బండి సంజయ్ డిమాండ్ చేశారు.