విద్యార్థుల కోసం

“తనిసిరే వేల్పులుదధి రత్నములచేత
వెరచిరే ఘోర కాకోల విషముచేత
విడిచిరే యత్నమమృతంబువొడముదనుక
నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు “

భర్తృహరి సుభాషితం ఇది ‘దేవతలు సముద్ర మధనంలో రత్నాలు లభించగానే సంతృప్తి చెందలేదు, భయంకరమయిన కాలకూట విషం బయటికి రావడంతో భీతిల్లలేదు, అమృతం లభించే వరకు ప్రయత్నం మానలేదు, నిపుణమతులు తాము నిశ్చయించిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నిస్తారు’ అన్నది ఈ సుభాషితం సారాంశం. ఇది విద్యార్థులు ప్రత్యేకంగా గమనించవలసిన, తప్పక జ్ఞాపకం పెట్టుకోవలసిన హితోక్తి.   రెండు రోజుల క్రితం పదవ తరగతి ..అంతకు ముందు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి   ఇటీవల పలు పరీక్షల, కోర్సుల ఫలితాలు కూడా  ప్రకటితమయినాయి, ప్రకటితమవుతున్నాయి. ఉత్తీర్ణులయిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఏవో కారణాల వల్ల ఉత్తీర్ణులు కాని వారు ఎంత మాత్రం నిరుత్సాహ పడరాదు. భర్తృహరి సుభాషితాన్ని విస్మరించకుండా, లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలతో ప్రయత్నించాలి.

మన విశ్వవిద్యాలయాలు, బోర్డులు, ఉన్నత విద్యా మండలి, ఇతర విద్యాసంస్థలు ప్రవేశ పరీక్షలను (ఎంట్రెన్స్ ‌టెస్టులు), ఆయా కోర్సుల పరీక్షలను సక్రమంగా నిర్వహిస్తున్నాయా, కష్టపడి చదివే విద్యార్థులకు, ప్రతిభావంతులకు న్యాయం జరుగుతున్నదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు తగిన సమాధానం లభించడం లేదు. ఉన్నత చదువుల ప్రవేశ  ‌పరీక్షల  నిర్వహణలో ఫలితాల ప్రకలనలో ఎన్నో లోపాలు ఉంటున్నాయని, అక్రమాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం వింటున్నాం.  తల్లిదండ్రుల ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు అరణ్యరోదన మవుతున్నాయి. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, కుంభకోణాలు యధా ప్రకారం కొనసాగుతున్నాయి. కొన్ని ముఠాలకు లక్షల రూపాయల మూటలను ఇవ్వగలిగిన వారికి  ‌ప్రశ్నాపత్రాలు ముందే చేతికి వస్తాయని, అనుకూల పరీక్షా కేంద్రాల కేటాయింపు జరుగుతుందని, సమాధాన పత్రాలు మారుతాయని, మెడిసిన్‌లో లేక ఇంజినీరింగ్‌లో సీట్లు లభించే ర్యాంకులు ఖాయమని ప్రతి సంవత్సరం వింటున్నాం. అందరు విద్యార్థుల తల్లిదండ్రులు ధనవంతులు కారు ఈ ముఠా లకు మూటలిచ్చి ర్యాంకులు, సీట్లు సంపాదించలేరు, శ్రీమంతులు, ముఖ్యంగా నల్లడబ్బు మూలుగుతున్నవారు  ధారాళంగా ఖర్చుచేసి తమ పిల్లలకు సీట్లు సులభంగా సంపాదించగలుగుతున్నారు.

    విద్యాబోధన ఒక పెద్ద వర్తకంగా మారింది, ఈ రోజు రాజకీయాల తరువాత రెండవ స్థానం ఆక్రమిస్తున్న వర్తకం బహుశా విద్యదే. రాజకీయ వర్తకం, విద్యావర్తకం రెండూ ఉన్నవారు అవలీలగా కోట్లకు  పడగలెత్తి సమాజంలో పెత్తనం చేయగలుగుతారు. ఈనాటి మన విద్యావ్యవస్థలోని అవకతవకలు, లోపాలు, అక్రమాల కారణంగా బలి అవుతున్నది ప్రతిభావంతులయిన విద్యార్థులు, ప్రతిభ, పరిశ్రమ రెండూ ఉన్నప్పటికి ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు, ఇతర నియమ నిబంధనల పర్యవసానంగా కావాలనుకున్న సీట్లు పొందలేక నిస్పృహ పాలవుతున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఆ విద్యార్ధుల ప్రతిభ, అర్హత, సామర్థ్యం అడవికాచిన వెన్నెల వలే వృధా అవుతున్నాయి. ప్రతిభావంతులయిన విద్యార్ధులకు యాంత్రిక నిబంధనలు, రిజర్వేషన్ల  కారణంగా అన్యాయం జరగకుండా నిరోధించే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలి.
ఈ విషయంలో స్వచ్చంద సంస్థలు సైతం ప్రయో జనకర పాత్రను నిర్వహించవొచ్చు. ప్రతిభ ఉన్నప్పటికీ, అర్హతలకు కొదువ లేకపోయినప్పటికి ప్రభుత్వ నిబంధనలు, పేదరికం అడ్డంకులయి విద్యావకాశాలు కోల్పోతున్న విద్యార్థులు నిస్పృహకు లొంగిపోతే ప్రయోజనం శూన్యం. మనో స్థయిర్యాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ విద్యార్ధులు తమ లక్ష్యాలను సాధించడానికి సాహసంతో కృషి జరుపాలి ..కేవలం వోట్ల మీదనే దృష్టినంతా కేంద్రీకరించి విధానాలను రూపొందిస్తున్న పాలకులు, అధికారం కోసం తహతహలాడుతున్న రాజకీయవాదులు విద్యా రంగంలో అవసరమయిన సంస్కరణలను ప్రవేశపెట్టుతారన్న నమ్మకం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page