“తనిసిరే వేల్పులుదధి రత్నములచేత
వెరచిరే ఘోర కాకోల విషముచేత
విడిచిరే యత్నమమృతంబువొడముదనుక
నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు “
భర్తృహరి సుభాషితం ఇది ‘దేవతలు సముద్ర మధనంలో రత్నాలు లభించగానే సంతృప్తి చెందలేదు, భయంకరమయిన కాలకూట విషం బయటికి రావడంతో భీతిల్లలేదు, అమృతం లభించే వరకు ప్రయత్నం మానలేదు, నిపుణమతులు తాము నిశ్చయించిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నిస్తారు’ అన్నది ఈ సుభాషితం సారాంశం. ఇది విద్యార్థులు ప్రత్యేకంగా గమనించవలసిన, తప్పక జ్ఞాపకం పెట్టుకోవలసిన హితోక్తి. రెండు రోజుల క్రితం పదవ తరగతి ..అంతకు ముందు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి ఇటీవల పలు పరీక్షల, కోర్సుల ఫలితాలు కూడా ప్రకటితమయినాయి, ప్రకటితమవుతున్నాయి. ఉత్తీర్ణులయిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఏవో కారణాల వల్ల ఉత్తీర్ణులు కాని వారు ఎంత మాత్రం నిరుత్సాహ పడరాదు. భర్తృహరి సుభాషితాన్ని విస్మరించకుండా, లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలతో ప్రయత్నించాలి.
మన విశ్వవిద్యాలయాలు, బోర్డులు, ఉన్నత విద్యా మండలి, ఇతర విద్యాసంస్థలు ప్రవేశ పరీక్షలను (ఎంట్రెన్స్ టెస్టులు), ఆయా కోర్సుల పరీక్షలను సక్రమంగా నిర్వహిస్తున్నాయా, కష్టపడి చదివే విద్యార్థులకు, ప్రతిభావంతులకు న్యాయం జరుగుతున్నదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు తగిన సమాధానం లభించడం లేదు. ఉన్నత చదువుల ప్రవేశ పరీక్షల నిర్వహణలో ఫలితాల ప్రకలనలో ఎన్నో లోపాలు ఉంటున్నాయని, అక్రమాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం వింటున్నాం. తల్లిదండ్రుల ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు అరణ్యరోదన మవుతున్నాయి. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, కుంభకోణాలు యధా ప్రకారం కొనసాగుతున్నాయి. కొన్ని ముఠాలకు లక్షల రూపాయల మూటలను ఇవ్వగలిగిన వారికి ప్రశ్నాపత్రాలు ముందే చేతికి వస్తాయని, అనుకూల పరీక్షా కేంద్రాల కేటాయింపు జరుగుతుందని, సమాధాన పత్రాలు మారుతాయని, మెడిసిన్లో లేక ఇంజినీరింగ్లో సీట్లు లభించే ర్యాంకులు ఖాయమని ప్రతి సంవత్సరం వింటున్నాం. అందరు విద్యార్థుల తల్లిదండ్రులు ధనవంతులు కారు ఈ ముఠా లకు మూటలిచ్చి ర్యాంకులు, సీట్లు సంపాదించలేరు, శ్రీమంతులు, ముఖ్యంగా నల్లడబ్బు మూలుగుతున్నవారు ధారాళంగా ఖర్చుచేసి తమ పిల్లలకు సీట్లు సులభంగా సంపాదించగలుగుతున్నారు.