- రూ.పదివేలు అందించాలని ఆదేశం
- పోడుపట్టాల పంపిణీకి సిద్ధం కండి
- రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించండి
- అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల సాయానికి చర్యలు
- సిఎస్, అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
- భద్రాచలం కల్యాణానికి కోటి….సిఎం ప్రత్యేక నిధుల నుంచి విడుదల…మంత్రి కృతజ్ఞతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : అకాలంగా కురిసిన వడగండ్లవానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంటనష్టం, పోడు భూములు, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకం తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్ సవి•క్షా సమావేశం నిర్వహించారు. వడగండ్ల వానలతో పంటనష్టం జరిగిన నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎకరానికి రూ.10వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని సవి•క్షా సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లా పరిధిలో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి, జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ మేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారికి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆదేశించారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా..రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలని చెప్పారు. అలాగే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి ప్రకటించిన మేరకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు విధివిధానాలను రూపొందించి జారీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిషారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో అర్హులైనవారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందా అంటూ సీఎస్ను ఆరా తీశారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి.. 1.55 లక్షల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు.. పాస్బుక్కులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎంకు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టాల పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ఇదిలావుంటే శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30 న భద్రాచలంలో జరుగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.కోటి నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భద్రాచలం కల్యాణానికి రూ. కోటి కేటాయిస్తూ సిఎం కెసిఆర్ నిర్ణయంపై మంత్రి కృతజ్ఞతలు
భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 30న వైభవంగా జరుగనున్నది. ఈ సందర్భంగా కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్ నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులను వెచ్చించాలని తెలిపారు. కొరోనా సమయంలో భదాద్రి ఆలయానికి భక్తుల రాక తగ్గిందని, దాంతో ఆదాయం లేకపోవడం తో సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారని పేర్కొన్నారు.