రైతులకు మరింత చేరువగా డిసిసిబి సేవలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: వ్యవసాయాన్ని జీవన విధానం గా మార్చుకొని జీవనం సాగిస్తున్న రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరింత కృషి చేయాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.పటాన్ చెరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో రెండు కోట్ల 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న దుకాణాల సముదాయం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులతో పాటు చిరు వ్యాపారులకు, సంస్థలకు వివిధ పథకాల ద్వారా రుణాలు అందించడంలో డిసిసిబి ముందంజలో ఉందని అన్నారు. ఎప్పటికప్పుడు బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరితగతిన దుకాణాల సముదాయం నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. బ్యాంకు అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో  అమీన్ పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, డైరెక్టర్లు, పిఎసిఎస్ చైర్మన్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page