మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందు
మరో పదిపదిహేనేళ్ల వరకు ఢోకా లేదు
సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతున్నాం
పారిశ్రామికంగానూ రాష్ట్రంలో ఎంతగానో పురోగతి
అభివృద్ధికి కేరాఫ్గా హైదరాబాద్
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేసిన ఘనత కెసిఆర్దే
111 జీవో ఎత్తివేతతో అద్భుతమైన పట్టణీకరణ
క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..హైదరాబాద్లో నిర్మాణ రంగానికి మరో 10 నుంచి 15 ఏండ్లు ఢోకాలేదని స్పష్టం చేశారు. త్వరలో ఫార్మా సిటీని ప్రారంభిస్తామని చెప్పారు. బయటి రాష్ట్రాల వాళ్లు బతుకుదెరువు కోసం తెలంగాణకు వొస్తున్నారని, కానీ మనవాళ్లు దుబాయ్ పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించేలా క్రెడాయ్ ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. అందుకు అవసరమైన సాయం ప్రభుత్వం అందిస్తుందని హావి• ఇచ్చారు. దక్షిణ తెలంగాణపై క్రెడాయ్ దృష్టిపెట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్ను విమర్శించడమే విపక్షాలకు తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏం చేస్తారో విపక్ష నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏడు శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నామని, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
నిర్మాణరంగం వల్ల సంపద పెరుగుతుందని అన్నారు. తెలంగాణలో పారిశ్రామికీకరణ కూడా వేగంగా జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు అని, ఏడేండ్ల తర్వాత అది రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్నది నిర్మాణరంగమేనని చెప్పారు. దేశంలో 70 శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారని, నిర్మాణరంగం వల్ల సంపద సృష్టి జరుగుతున్నదని తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరాలే దేశానికి ఆర్థిక శక్తిగా ఉన్నాయని వెల్లడించారు. నగరాల విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. దేశంలో సంపద సృష్టించే నగరాల అభివృద్ధి కోసం ఏటా రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ అన్ని నగరాల కంటే ముందున్నదని కేటీఆర్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు నగరంలో స్థిరపడ్డారని చెప్పారు. కోవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాల రోగులు ఇక్కడ వైద్యం చేయించుకున్నారని వెల్లడించారు.
హైదరాబాద్ హెల్త్, ఎడ్యుకేషన్ హబ్గా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్ను ట్రీ సిటీగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని తెలిపారు. నగర అభివృద్ధిపై బీజేపీ ఎంపీలే ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పారు. గతంలో ఎండాకాలం వొస్తే జలమండలి ముందు ధర్నాలు జరిగేవని, ఇప్పుడు హైదరాబాద్లో తాగునీటి సమస్య లేకుండా చేశామని వెల్లడించారు. గతంలో ఏ పండుగ వొచ్చినా అల్లర్లు జరిగేవని, తెలంగాణ వొచ్చిన తర్వాత కుల, మత అల్లర్లు లేవన్నారు. తెలంగాణలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండేవని, రాష్ట్రం వొచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే ఆ సమస్య లేకుండా చేశామన్నారు. సాగుకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ కట్టాలంటే లంచాలు చెల్లించాల్సిందేనని, కానీ రాష్ట్రంలో భవనాల అనుమతుల్లో అవినీతి లేకుండా చేశామన్నారు. 2022 నాటికి అందరికీ ఇండ్లు కట్టిస్తామని ఒక పెద్దాయన చెప్పాడని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు.
ప్రభుత్వాన్ని నడపడమంటే ఇల్లు నడిపినంత ఈజీ కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం ఐటీ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం ప్రగతి సాధించదని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలిపారు. 111 జీవో తన కోసమే ఎత్తివేశారని ఒక పిచ్చోడు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 111 జీవో పరిధిలో లక్షా 30 వేల ఎకరాలు ఉన్నాయని, అవన్నీ తనవేనా అని ప్రశ్నించారు. జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే హావి• ఇచ్చారని గుర్తుచేశారు. ఆ జీవో పరిధిలో అద్భుతమైన కొత్త నగరాన్ని సృష్టించవచ్చని తెలిపారు. దేశంలో కెల్లా హైదరాబాద్ బెస్ట్ సిటీ అని వెల్లడించారు. ఇతర రాష్టాల్రతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. నగరంలో రోడ్ల అభివృద్ధిని చూసీ సీజేఐ ఎన్వీ రమణ మెచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పక్క రాష్ట్రాల నుంచి బిల్డర్లు వొస్తున్నారని పేర్కొన్నారు. మన దగ్గర నుంచి ఎంత మంది బిల్డర్లు బయట రాష్ట్రాలకు వెళ్తున్నారని అడిగారు. హైదరాబాద్లో తాగునీటి సమస్య లేకుండా చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. తాగునీటికోసం జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. భవిష్యత్లో హైదరాబాద్లో ప్రతిరోజు తాగునీరు ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్లో వందశాతం ఎస్టీపీ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.