శ్రీశుభకృత్ అన్ని వర్గాల ప్రజలకు శుభం చేకూర్చాలని ఆకాంక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాలలో శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదనీ, అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలచిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు ఉగాది నుంచే నూతన సంవత్సరం ఆరంభమవుతుందనీ, తమ వ్యవసాయ పనులను రాష్ట్ర ప్రజలు ఉగాది నుంచే ప్రారంభించుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం,సాగునీటి రంగాలకు అధిక ప్రోత్సాహాన్ని ఇస్తున్నదనీ, రైతలన్న సంక్షేమానికి అత్యధిక ప్రధాన్యత ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమేననీ, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.