- వాళ్ల కళ్లు మండుతున్నయ్
- ఉద్యమంలోనూ, అభివృద్ధిలోనూ సిద్ధిపేట ముందుంది
- పామాయిల్ తోటల్లో కూడా ముందుంటుంది
- కాంగ్రెస్కు భవిష్యత్ లేదు
- ప్రత్యేక రాష్ట్ర వొస్తే తెలంగాణ చీకటవుతుందన్నరు..ఇప్పుడు ఆంధ్రానే చీకటయింది
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు
- పామాయిల్ ఫ్యాక్టరీకి మంత్రి హరీష్రావు మా మెడపై కత్తి పెట్టిండు…
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఓ సన్యాసి…
- సిఎం కేసీఆర్ వ్యూహాకర్త అయితే హరీష్ అమలు చేస్తారు
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
- నర్మెటలో రూ.300 కోట్ల పామాయిల్ కర్మాగారానికి శంఖుస్థాపన
సిద్ధిపేట, ఏప్రిల్ 13(ప్రజాతంత్ర బ్యూరో) : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే కేంద్రంలోని బిజెపి పార్టీ నేతల కళ్లు మండుతున్నాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు బిజెపిపై తనదైనశైలిలో నిప్పులు చెరిగారు. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అన్నింట్లో నెంబర్ వన్ అని, ఈర్ష్యతో, అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు చేస్తుందనీ మంత్రి హరీష్రావు అన్నారు. బుధవారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెటలో 60 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పామాయిల్ కర్మాగారానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మంత్రి హరీష్రావు, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ…..
కేంద్రం తొండాట ఆడుతుందని, యాసంగి పంట అంటేనే బాయిల్డ్ రైస్ అని, రా రైస్ పట్టిస్తే నూకలు ఎక్కువ..బియ్యం తక్కువ అని, పండిన బాయిల్డ్ రైస్ ఇస్తమంటే రా రైస్ కొంటమని చెబుతరు…బాయిల్డ్ రైస్ కొనమంటరని, కేంద్ర వ్యవహారం నోటితో చెప్పి నొసటితో ఎక్కిరించినట్లుందని విమర్శించారు. నూకలు ఎంత ఖర్చయితే అంత 2 వేల కోట్లా, 3 వేల కోట్లా ఆ నష్టం మనం భరిద్దాం, రైతును నిలబెడదామని సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారనీ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సమస్య సృష్టిస్తున్నరని, తెలంగాణ పట్ల వాళ్ల కళ్లు మండుతున్నాయన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నింట్లో..తలసరి ఆదాయంలో, ఆర్థిక వృద్ది రేటులో…24 గంటల ఉచిత విద్యుత్తు్వ వడంలో…రైతుకు ఎకరానికి పది వేల ఇవ్వడంలో…రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇవ్వడంలో.. అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా…వైద్యంలో నెంబర్ వన్ అని అన్నారు.
దిల్లీలోని బిజెపి నేతలకు ఏమని తిట్టాలో అర్థం కావడం లేదని, బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అన్నింట్లో నెంబర్ వన్ అనే ఈర్ష్యతో, అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు చేస్తుందని హరీష్ రావు ఆరోపించారు. అందులో ఒకటి.. వడ్లు కొనమని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో…రైతుల్లో అశాంతి రావాలని, తక్కువ ధరకు రైతులు అమ్ముకుని నష్టపోవాలని చూస్తున్నారని అన్నారు. బీఆర్జీఎప్లో 1350 కోట్లు ఇవ్వాలి. 50సార్లు దరఖాస్తు పెట్టినం. అవి ఇవ్వడం ఆపేశారు. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు్వ వాలంటే ఇవ్వలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు. అప్పులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు. బాయిల కాడ మీటర్లు పెడితే 25 వేల కోట్లు అప్పు ఇస్తమంటరు.
సిఎం మీటరు బాయిల కాడ పెట్టేది లేదని చెప్పారు. ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకోవాలి. రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి వంటి వాళ్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారనీ, వారి పాలనలో ఒక్క మడి ఎండకుండా పంట పండిందా అని ప్రశించారు. కరెంటు కోతలు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, నెర్రలు బాసిన నేలలు. ఇంకా కలలు కంటున్నరు. దేశంలో ఉన్న సీట్లే పోతున్నయి. మీ సంసారం చక్కగ లేదు. మీ కాంగ్రెస్ పార్టీ చక్కగ లేదు. మీరు అధికారంలోకి వొస్తరంట. 200 పెన్షన్ మీరు ఇస్తే కేసీఆర్ 2000 ఇస్తున్నరు. ఆరు గంటల కరెంటు ఇస్తే, 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తుంది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీకు ఏం చూసి వోటయ్యేలా..కాంగ్రెస్ అంటే చరిత్ర కోసం మాట్లాడాలి తప్ప భవిష్యత్తు లేని పార్టీ.
కాంగ్రెస్వి పగట కలలు అంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ సిద్దిపేట జిల్లాలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందనీ, సిఎం కేసీఆర్ నాయకత్వంలో కానే కాదు, నీళ్లు రానే రావు అని కాంగ్రెస్, బిజెపి వాళ్లు మాట్లాడారు. కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నీరు తెచ్చుకున్నం. కిరణ్కుమార్ రెడ్డి మీకు చీకటే కరెంటు ఎక్కడ అన్నరు. ఏపీలో చీకటి ఉంది కానీ, తెలంగాణలో 24 గంటల కరెంటు ఇచ్చి చూపిండు కేసీఆర్. ఇంట్లో నుండి రైతు బయట కాలు పెట్టకుండా ఎకరానికి పది వేల రూపాయలు పెట్టుబడి కేసీఆర్ ఇస్తున్నాడన్నారు. వవసాయం చేసే రైతులు నాలుగు డబ్బులు సంపాదిస్తే ఆనందం. రైతులు వరి వరి అని ఒకటే పంట వేస్తున్నరు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో రైతే రాజు కావలన్నది కేసీఆర్ కల అన్నారు. వరి వేస్తే 20 లేదా 25 వేలు మిగులుతుంది. కానీ, రైతు ఆదాయం పెరగాన్నది మా తపన. అందు కోసమే ఆయిల్పామ్ను మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో ఆయిల్ పామ్ జిల్లాగా డిక్లేర్ చేయించినం. ఎకరానికి 80 వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నం.
డ్రిప్ కంపెనీలకు సబ్సిడీ పెంచినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చాలా మందిని పంపిన. కళ్లతో చూసి వొచ్చిండ్రు. తెలంగాణ వొచ్చాక మొట్ట మొదటి పామాయిల్ ఫ్యాక్టరీ సిద్దిపేటలో పెడుతున్నం. కోతులు, పందులు, చీడ పీడ లేని పంట. ధర రాదనే బాధలేదన్నారు. ఎకరానికి తక్కువలో తక్కువ లక్షా 50 వేల రూ•పాయలు నికరంగా లాభం వొస్తుంది. పంట కొనేది ఆయిల్ ఫెడ్ ప్రభుత్వ సంస్థ. ఫ్యాక్టరీ మన జిల్లాలోనే ఉంది. గవర్నమెంట్ ఉద్యోగికి జీతం ఎంత వొస్తదో..ఆయిల్ పామ్ రైతుకు అంతే వొస్తది. భారత దేశం లక్ష కోట్ల రూపాయల పామాయిల్ను దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో పండకనే పక్క దేశం నుండి తెచ్చుకుంటున్నాం. నూనే పంటల సాగు మన దేశంలో తక్కువ. పామాయిల్ కుమంచి డిమాండ్ ఉంటది. రైతులు పంటలు వేస్త బాగుపడతరు.
జులై నెల కల్లా 20 వేల ఎకరాలకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయనీ, ఇప్పటికే 3 వేల ఎకరాల్లో పంట వేశారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రతీ మండలంలో పెద్ద ఎత్తున పామాయిల్ తోటలు పెట్టేలా చర్య తీసుకోవాలనీ, రైతులకు టిఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకే కేసీఆర్ రైతు నష్టపోవద్దని 2 వేల కోట్ల అయినా నూకల నష్టం భరిస్తామని ప్రకటించారు. యాసంగి పంట ముగియగానే, వానా•కాలంలో 20 వేల ఎకరాల్లో పామాయిల్ పంట వేసేందుకు ముందుకు రండి. సత్తుపల్లి వెళ్లి చూసి వస్తానంటే రైతులను పంపుతామన్నారు. అప్పులు పోయి, ఇళ్లు కట్టుకుని, పిల్లలను చదివించుకోవలనే నా తాపత్రయం అన్నారు. బిజెపి వాళ్లు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తమన్నరు. చేసిండ్రా..? డిజీల్ ధర డబుల్, ఎరువుల ధరలు డబుల్ చేసి ఖర్చు పెంచారనీ, బిజెపి పార్టీ ప్రభుత్వం రాక ముందు 2 వేలు ట్రాక్టర్ ఖర్చు అది ఇప్పుడు 5 వేల రూపాయలైందన్నారు. ఎరువులు పోటాష్ 1700 అయింది. డీఏపీ పెరిగింది. బిజెపి మాటలు చెప్పింది తప్ప..చేతల్లో చేయలేదు, బిజెపికి గుణ పాఠం తప్పుదన్నారు. సిద్ధిపేట ఉద్యమంలో ముందుంది. అభివృద్ధిలో ముందుంది. పామాయిల్ తోటల్లో కూడా ముందుంటుందనీ మంత్రి హరీష్రావు అన్నారు.