- వడదెబ్బకు ఇప్పటి వరకు 8 మంది మృతి
- బేగంపేటలో కారు దగ్ధం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రమాదానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు పలు చోట్ల వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవగా..తాజాగా నగరంలోని బేగంపేటలో కారులో మంటలు చెలరేగాయి. కారులోంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమై కారులోనివారు కిందకుదిగడంలో ప్రమాదం తప్పినట్లయ్యింది. ఆ తర్వాత కారంతా మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. రాష్ట్రంలో వడదెబ్బతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హన్మకొండకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు జున్ను రాజు గీసుకొండలో పని చేస్తూ అస్వస్థతకు గురై మృతి చెందారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన సారాంగం వాటర్ బాటిళ్లు విక్రయిస్తూ వడదెబ్బతో బస్టాండ్లో మృతి చెందారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో రాజయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డి నాయక్ తండాలో బుజ్జమ్మ ఎండ తీవ్రతో చనిపోయారు. నాగారం మండలం ఈటూరులో అంజయ్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం రాజులగూడు తండాకు చెందిన కూలీ బాలాజీ వడదెబ్బకు బలయ్యారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాదేపాడులో వృద్ధుడు పుల్లయ్య, చింతకాని మండలం గాంధీనగర్కు చెందిన మారెముత్తు ఎండల తీవ్రతతో వడదెబ్బకు లోనై చనిపోయారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో చాలా ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.