- అడ్డంకులు అధిగమించి బిజెపి సభ విజయవంతం
- కేంద్రం సహకరిస్తున్నా విమర్శలు చేస్తున్న కెసిఆర్
- వేములవాడ బూత్ కమిటీ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
వేములవాడ, ప్రజాతంత్ర, మే 18 : సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్లో బిజెపి సభ విజయవంతమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్లో భాజపా బూత్ కమిటీ సమావేశానికి హాజరైన నేపథ్యంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రజా సంగ్రామయాత్ర రెండో విడత విజయవంతమైందన్న ఆయన… త్వరలోనే మూడో ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పోలింగ్ బూత్ స్థాయిలో వేములవాడ మండలంలో 20 మంది సభ్యులను నియమించామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉందన్న బండి… కానీ దానికి కేసీఆర్ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. కేవలం కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. ప్రజల కష్టాలు తీరాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావల్సిందేనంటూ నొక్కి చెప్పారు. అంతే కాదు ప్రతీ ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
తెలంగాణ సమాజానికి ఒక భరోసా వొచ్చింది…అట్టడుగు ప్రజలకు అండగా బీజేపీ ఉన్నదని బండి చెప్పారు. అంతే కాకుండా ప్రధాని మోడీతో కలిసి పోలింగ్ బూత్ కమిటీలతో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇక సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్పై బండి నిప్పులు చెరిగారు. కేటీఆర్ సైకోలాగా మారాడని, అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని అని మర్చిపోయి కేటీఆర్ కామెంట్స్ చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్కు సన్ స్ట్రోక్ గ్యారంటీ…ప్రభుత్వానికీ సన్ స్ట్రోక్ గ్యారంటీ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. అన్ని సర్వేల్లోనూ భాజపాకు తప్ప కాంగ్రెస్, టీఆర్ఎస్లకు ఎక్కడా గెలిచే అవకాశం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీలంకలో కుటుంబ పాలన ఉంటే పరిస్థితి ఏమైంది..? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే జీతాలు, పెన్షన్స్ ఇవ్వలేని పరిస్థితి తెలంగాణకు వొచ్చిందని…కానీ శ్రీలంక పరిస్థితి రావద్దంటూ బండి సంజయ్ అన్నారు. వీటికి తోడు నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను ఇంకా ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం టాక్స్ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించడం లేదని చెప్పారు.