- హనుమకొండలో ఘటన..నిలకడగా యువతి ఆరోగ్య పరిస్థితి
- ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి : విద్యార్థులు, ప్రజాసంఘాల నేతల డిమాండ్
- కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
ప్రజాతంత్ర, హనుమకొండ, ఏప్రిల్ 22 : తనను ప్రేమించట్లేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. నర్సంపేట పరిధిలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన అనూష(23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనలియర్ చదువుతుంది. చదువు రీత్యా అనూషతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పోచమ్మ గుడి సవి•పంలోని గాంధీ నగర్లో నివాసముంటున్నారు. అయితే తనను ప్రేమించాలని అజహర్ అనే యువకుడు.. అనూషను గత కొంతకాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడు. అనూష మాత్రం అజహర్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వొస్తుంది.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గాంధీ నగర్ చేరుకున్న అజహర్.. ఇంట్లో అనూష ఒక్కరే ఉన్నట్లు నిర్దారించుకున్నాడు. దీంతో ఇంట్లోకి ప్రవేశించిన అజహర్.. తనను ప్రేమించాలని పట్టుబట్టాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తన వెంట తెచ్చుకున్న కత్తితో అనూష గొంతును కోసి పరారీ అయ్యాడు. అప్పుడే ఇంటికి వొచ్చిన తల్లి.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అనూషను చూసి షాక్కు గురైంది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి తరలించారు. అనూషకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుబేదారి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అజహర్ను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు.
ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి : విద్యార్థులు, ప్రజాసంఘాల నేతల డిమాండ్
విద్యార్థిని అనూషపై కత్తితో దాడిచేసిన ఉన్మాది అజార్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఎన్కౌంటర్ చేయాలని తోటి విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రేమపేరుతో దాడికి తెగబడే వారికి బుద్ది వొచ్చేలా శిక్షించాలన్నారు. యువతిపై దాడి ఘటన సమాచారం తెలిసిన వర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు.
అలాగే ప్రజా సంఘాల నేతలు కూడా హాస్పిటల్కి వొచ్చారు. ఉన్మాది చర్యపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడంతోనే మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. అజార్ లాంటి వారికి బుద్ది చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హాస్పిటల్ వద్ద వారు నినాదాలు చేశారు.
ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
హనుమకొండ అశోక్ నగర్లో ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిని ప్రేమ పేరుతో వెంట పడుతూ..ఓ కిరాతకుడు గొంతు కోసిన సంఘటనపై స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనూష ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనూషకు మంచి వైద్యం అందించాలన్నారు.
ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని హావి ఇచ్చారు. అనూషపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటన దుర్మార్గమన్నారు. దోషిని వదలబోమని, ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్త పడాల్సి ఉందన్నారు.