- ఒకరోజు ముందుగానే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా
- పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం
పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. 8న సమావేవాలు ముగుస్తాయని ప్రకటించినా ఒకరోజు ముందు పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14న మొదలై షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 శుక్రవారం వరకు జరగాల్సి ఉండగా ఒకరోజే ముందే ముగిశాయి. ఈసారి బడ్జెట్ ఆమోదంతో పాటు కీలక బిల్లులైన దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(సవరణ) బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్(ఐడెంటిఫికేషన్) బిల్లులకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది.
గురువారం సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాలను ముగిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. రాజ్యసభలో మాత్రం చివరి రోజు కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఛైర్మన్ వెంకయ్యనాయుడు..సభ వాయిదా ప్రకటనను చదివే సమయంలో కాంగ్రెస్, శివసేన ఎంపీలు నినాదాలు చేశారు. భాజపా నేత కిరీటి సోమయ్య అక్రమ నిధుల మళ్లింపు విషయంపై చర్చ జరపాలని శివసేన డిమాండ్ చేయగా.. కాంగ్రెస్ అందుకు మద్దతు పలికింది. ధరల పెరుగుదలపై చర్చ జరపలేదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి 31న పార్లమెంట్ బ్జడెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
రెండు విడతల్లో సమావేశాలు నిర్వహించారు. తొలి విడత ఫిబ్రవరి 11న ముగిసింది. మొదటి దశ సమావేశాల్లోనే బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. కొద్దిరోజుల విరామం తర్వాత ఉభయ సభలు..మార్చి 14న రెండో విడత కోసం సమావేశమయ్యాయి. ఏప్రిల్ 8 వరకు ఈ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను కేంద్రం ఆమోదింప చేసుకుంది.