గురువారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంతో రెండు దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రస్థానం ముగిసింది. నేటికి సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళ, ఏడు నెలల పన్నెండు రోజుల క్రితం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న నినాదంతో టిఆర్ఎస్ ఆవిర్భవించింది. 2001 ఏప్రిల్ 27న మాజీ మంత్రి దివంగత డా.కొండాలక్ష్మణ్ బాపూజీకి చెందిన జలదృశ్యంలో తెలంగాణరాష్ట్ర సాధనకోసం ఉద్భవించిన ఈ పార్టీ అనేక ఒడుదొడుకుల అనంతరం రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించింది. ముందుగా ఉద్యమ పార్టీగానే కొనసాగినప్పటికీ ఆ తర్వాత రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. తెలంగాణరాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ త్వరలో రానున్న శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో ఉంది. అయితే ఈసారి టిఆర్ఎస్ పార్టీగా కాకుండా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పేరున రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవంగా మునుగోడు ఎన్నికలోనే బిఆర్ఎస్ పార్టీగానే పోటీ చేయాలనుకుంది. కాని, ఎన్నికల కమిషన్• అనుమతిరాకపోవడంతో టిఆర్ఎస్గానే పోటీలో నిలబడి గెలిచింది. దశాబ్ధాలుగా ప్రాంతేతరుల పెత్తనంకింద ఉన్న తెలంగాణ ప్రాంతం అభివృద్ధిని సాధించలేకపోయింది. ఈ ప్రాంతం హక్కులు హరించబడ్డాయి. ప్రజల జీవన విధానం అధ్వాన్నంగా తయారవడంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది.
రాష్ట్రం సాధించుకున్నతర్వాత పూర్తి స్థాయిలో కాకున్నా తెలంగాణ స్వయం సమృద్ధిని సాధించుకోవడం ప్రారంభించింది. అయితే కేంద్రం తగినంతగా సహకారం అందించకపోవడంతో అనుకున్న స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేయలేకపోతున్నామని టిఆర్ఎస్ ప్రభుత్వం కొద్దికాలంగా కేంద్రంపైన విరుచుకు పడుతున్నది. ఇతర పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపిస్తున్నదన్న విమర్శఉంది. ఇతర పార్టీ ప్రభుత్వాలను కూలదోసి బిజెపి లేదా దాని అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నదన్న అపనిందకూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపైన ఉంది. అంతేగాక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని, దేశంలోని వనరులను సక్రమంగా వినియోగించుకోకుండా ప్రజలపై భారాన్ని మోపుతున్నదన్న విమర్శకూడా ఉంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ, లక్షలాది కార్మికులకు ఉపాధి అవకాశాలను కేంద్రం కొల్లగొడుతున్నది. వ్యవసాయ రంగం, సాగునీటి రంగంపైన అవగాహనలేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నది. అధికారంలోకి రావడానికి ముందు ఇస్తామన్న కోట్లాది ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవడంలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అందుకే కేంద్ర రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందుకు తానే దేశ రాజకీయాల్లోకి వెళ్ళనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత పలుసార్లు చెబుతూ వొచ్చారు. అదే లక్ష్యంతో ఆయన టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా ఆవిష్కరించారు. అక్టోబర్ అయిదున విజయదశిమి రోజున టిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆ పార్టీని బిఆర్ఎస్గా మారుస్తున్నట్లు సర్వసభ్య సమావేశం తీర్మానించింది.
దాని ఆమోదం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించింది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కెఎన్ భర్ ఈ తీర్మానాన్ని ఆమెదిస్తున్నట్లు గురువారం పార్టీ కార్యాలయానికి లేఖ పంపించారు. బిఆర్ఎస్ ప్రకటన చేసిన సరిగ్గా రెండు నెలల తర్వాత అంటే డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర రాజధాని లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పేరు బిఆర్ఎస్ మార్పుకు సంబంధించిన అధికారిక పత్రాలపైన కెసిఆర్ సంతకం చేశారు. దీంతో దాదాపు రెండు దశాబ్దాల టిఆర్ఎస్ ప్రస్థానానికి స్వస్థి చెప్పినట్లైంది. దానికి ముందు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు కెసిఆర్. టిఆర్ఎస్ పార్టీ రంగులోనే ఉన్న ఈ పతాకంపైన తెలంగాణ పటానికి బదులు దేశపటం చిత్రీకరించబడింది. అయితే పార్టీ ఎన్నికల చిహ్నమైన కారు బొమ్మ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఎన్నికల కమిషన్ అదే కారు బొమ్మనే కేటాయించిందా లేదా అన్న అనుమానాలకు తావేర్పడింది. ఇదిలా ఉంటే పేరు మార్పుపై తెరాస నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణకోసమే ఉద్భవించిందని ఇంతకాలం చెప్పుకుంటూ వొచ్చిన టిఆర్ఎస్కు దీంతో కాలం చెల్లిందని, ఇక తెలంగాణ అంటేనే టిఆర్ఎస్, టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ అన్న నినాదం బిఆర్ఎస్కు వర్తించదంటున్నారు.
తెలంగాణ అస్థిత్వంగా చెప్పుకుంటున్న ఆ పార్టీకి పేరు బంధమే కాదు, పేగు బంధంకూడా తెగిపోయిందంటున్నారు. ఇదిలాఉంటే ఇవ్వాళ బిఆర్ఎస్పేర జాతీయ పార్టీగా ఆవిర్భవించిన ఈ పార్టీ దిల్లీ లో రైతు సర్కార్గా కొనసాగుతుందన్న ధీమాను కెసిఆర్ వ్యక్తం చేయడం నిజంగా హర్షించాల్సిన విషయమే. ఈ నెల 14న దిల్లీ లోని సర్థార్ పటేల్ మార్గ్లో బిఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించే క్రమంలో బిఆర్ఎస్ జాతీయ విధానాన్ని కెసిఆర్ ప్రకటించనున్నారు. దేశంలో పరివర్తన తీసుకురావడంలో భాగంగా జాతీయ నూతన పర్యావరణ విధానాన్ని, మహిళా సాధికారతకు జాతీయ పథకాన్ని, వ్యవసాయంలో నూతన వరవడిని తీసుకువచ్చే విధంగా, దేశవ్యాప్తంగా ఉన్న జలవనరులను సద్వినియోగం చేసుకునే విధానాలను కెసిఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. బిఆర్ఎస్ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా దేశ పాలనా వ్యవస్థను గాడిలో పడేసే నూతన ఆర్థిక విధానాలను రూపొందించాలన్నదే కెసిఆర్ ప్రధాన లక్ష్యం. కాగా బిఆర్ఎస్ అరంగెట్రానికి ఆ పార్టీ మహారాష్ట్రను ఎంచుకుంది. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించడమేకాదు, అక్కడ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్దపడుతోందన్న కెసిఆర్ ప్రకటన ఆ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. కాగా బిఆర్ఎస్ ప్రారంభ కార్యక్రమానికి అతిధిగా వొచ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని ఈసారి సిఎంగా చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని కెసిఆర్ చెప్పడం, బిజెపిని వ్యతిరేకించే పార్టీలతో బిఆర్ఎస్ మిత్రత్వానికి నాంది పలికినట్లైంది.
గెస్ట్ ఎడిట్ ….. మండువ రవీందర్రావు




