నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
పదవులు తృణపాయం!… ప్రజా శ్రేయస్సు ప్రాణం!… మాట తప్పనివాడు!… మడమ తిప్పని వాడు!… నిరంకుశ నవాబును గడగడలాడించిన వాడు!… ప్రజాస్వామ్య ప్రియుడు!… ప్రజాభ్యుదయ కంకణ ధారుడు!… వంచన, మోసం, కపటం, కుట్రలు తెలియనివాడు!… నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం!… దేశం కోసం కన్న కొడుకు ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు!… సమస్త ప్రజానీక శ్రేయస్సు కోసం తన ఆస్తి జలదృశ్యంను అర్పించిన వాడు!… సాటిలేని మేటి ప్రజా నాయకుడు! బాపూజీ………..
కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే ఒక ఆవేశం!.. ఒక ఆకాంక్ష!.. ఒక ఆశ యం!… ఒక ఉద్య మం!…ఇవన్నీ కలిస్తే కొండా లక్ష్మణ్ బా పూజీ. దశాబ్దాల పోరా టానికి నిలువెత్తు నిదర్శనం, నిజాం పాలనపై నిప్పులు చెరిగిన నిఖార్సైన గాంధేయవాది, తెలం గాణ ఉద్యమానికి జల దృశ్యాన్ని ధార పోసిన ధీరోదాత్తుడు కొండా లక్ష్మణ్, తన జీవి తంలో 30 సంవత్సరాలు లీగల్ లీడర్ గా, ఆ తర్వాత 30 సంవత్సరాలు పొలిటికల్ లీడర్ గా, మిగిలిన 37 సంవత్సరాలు తెలంగాణ లీడర్ గా తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప మానవతా శిఖరం. బాపూజీకి అధ్యయనం చేయడం ఆనందం, ఉద్యమం ఆయన ఊపిరి. ఆయన ఎప్పుడూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్,మరియు ఫ్రీడమ్ ఆఫ్ తాట్ లని కోరుకునే వాడు. బాపూజీ ఐదు ఉద్యమాలకు కీలక పాత్ర పోషించి నేతృత్వం వహించాడు అవి 1. తెల్ల వాళ్ళ నుండి భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం, 2. నిజామ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం,3. ఆంధ్ర పాలకుల నుండి విముక్తి ఉద్యమం,4. సామాజిక తెలంగాణ ఉద్యమం,5. కుల వృత్తులు చేతి వృత్తులను ప్రోత్సహించే సహకార ఉద్యమం. తన 17 వ సంవత్సరంలో గాంధీ గారిని కలిసినప్పుడు వారితో మాట్లాడి, తాను సంతృప్తి చెంది నిర్ణయం తీసుకొని తన తలపై ధరించిన గాంధీ గారి టోపీనీ చనిపోయేంతవరకు తీయలేదు. అంత నిబద్ధతగల గాంధేయ వాది కొండా లక్ష్మణ్.
ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా వాంకిడి లో బాపూజీ ,అమ్మక్క ల సంతానం లక్ష్మణ్, తండ్రి గ్రామంలో పోస్ట్ మాన్ గా ఉండేవాడు, ఏడవ తరగతి వరకు వాంకిడి లో ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం గావించి, ఎనిమిదో తరగతికి హైదరాబాద్ సిటీ కాలేజీ లో ప్రవేశం తీసుకొని ఆ తర్వాత తను చదువుకుంటూ ట్యూషన్స్ చెబుతూ ఆర్థిక వెసులుబాటు సమకూర్చుకొని, వకీలు కోర్సులో డిప్లోమా పూర్తిచేశారు, చిన్నప్పుడు ముష్టియుద్ధం, కర్రసాము లలో మంచి దిట్ట అయిన బాపూజీ అంతే స్ట్రాంగ్ గా మానసికంగా ఉండేవారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో గొప్ప ప్రావీణ్యం కలిగిన బాపూజీ తనను ప్రభావితం చేసిన పుస్తకాలు రాణా ప్రతాప్ సింగ్, చత్రపతి శివాజీ, డాక్టర్ రాజా రామ్మోహన్ రాయ్ లని తెలిపారు. వకాలత్ లో ప్రావీణ్యత సంపాదించి క్రిమినల్ లాయర్ గా పేరు సంపాదించి ,ఆ రోజుల్లోనే 25 మంది అసిస్టెంట్లను తన వద్ద ఉపాధి కల్పించిన గొప్ప లాయరు . అంతేకాకుండా చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ముప్పుతిప్పలు పెట్టిన విస్నూర్ దేశ్ముఖ్ కేసులను ఉచితంగా వాదించి గెలిచిన గొప్ప ధీశాలి. తన జీవిత పర్యంతము పేదవాళ్లకు బాధిత మధ్యతరగతి వారికి ఫీజు ఎప్పుడు తీసుకోలేదు.34 వ యేట డాక్టర్ గా ఉన్న శకుంతలను వివాహమాడి వారిని కూడా దేశ సేవకు మిల్ట్రీ లో చేర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమం నాన్ ముల్కీ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న బాపూజీ పదవి కంటే ప్రాంతానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు.
1952 లో అసిఫాబాద్ నుంచి చట్టసభకు మొట్టమొదటిసారిగా ఎన్నికై ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ గా, సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ జీవితంలో తెలంగాణ ప్రజా సమితి మరియు నవసమాజ పార్టీ ని ఏర్పాటు చేసి సమాజాన్ని జాగృతం చేశారు. 1962 లో రెండవసారి చట్టం సభకు పోటీ చేసి అన్యాయం జరిగి ఓడిపోయిన విషయాన్ని కోర్టులో కేసు వేసి గెలిచిన ధైర్యశాలి.1969లో విద్యార్థులు చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అక్కడే తన మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు ఏ పదవి తీసుకోబోమని అదే మాట పై చనిపోయేవరకు మాట మీద నిలబడ్డ మడమతిప్పని గొప్ప నాయకుడు. తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి ,గవర్నర్ అయ్యే అవకాశాలు ఉన్నా చీపురు పుల్లతో సమానంగా తీసిపారేసిన గొప్ప ధీశాలి.
97 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ కోసం ఎముకలు కొరికే చలిలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు కూర్చున్న కరుడుగట్టిన తెలంగాణవాది. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎర్రటెండల్లో ప్రతి ఊరూరా బస్సు యాత్రను జరిపిన గొప్ప ఉద్యమకారుడు బాపూజీ.తన ఆశ, శ్వాస,భాష ,యాస తెలంగాణ మే అని బతికాడు. వందేళ్ల భారతదేశ చరిత్రకు సాక్ష్యం ,తొలి తరం నుండి మలితరం వరకు అనేక ఉద్యమాలకు భీష్మాచార్యుడు బాపూజీ. ఎందరికో ఆశ్రయమిచ్చి అందరినీ ఎదగ నిచ్చిన గొప్ప సమతా వాది…వారి కీర్తి నలుమూలల ప్రకాశం.బీ.సీల రాజ్యాధికారం కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి.
డాక్టర్ అశోక్ పరికిపండ్ల, చార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి
(రచయిత కొండా లక్ష్మణ్ బాపూజీ అంతరంగిక హోమియోపతి వైద్యునిగా పనిచేశారు)




