Take a fresh look at your lifestyle.

మాతా శిశు మరణాలు తగ్గుముఖం

  • దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ
  • ఎర్రమంజిల్‌లో 200 పడకల సంరక్షణ కేంద్రం
  • శంకుస్థాపన సభలో మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌ ‌వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రయివేటు రంగంలో కానీ 100 పడకల డయాలసిస్‌ ‌యూనిట్‌ ఎక్కడా లేదు. నిమ్స్‌లో కేవలం 34 డయాలసిస్‌ ‌బెడ్లు మాత్రమే ఉన్నాయి.. వాటిని 100కు పెంచుకుంటున్నాం. దీంతో దాదాపు 1500 మంది రోగులు డయాలసిస్‌ ‌సేవలు పొందుతారని మంత్రి తెలిపారు. నిమ్స్‌కు అనుబంధంగా..ఎర్రమంజిల్లో నిర్మించే 200 పడకల మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీష్‌ ‌రావు మంగళవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంసీహెచ్‌ ‌సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటళ్లను మొదటిసారిగా రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో మూడు ఎంసీహెచ్‌ ‌హాస్పిటళ్లు మాత్రమే ఉండేవని, ఆ సంఖ్యను 27కు పెంచుకున్నట్లు వెల్లడించారు. తద్వారా గొప్ప ఫలితాలు వచ్చాయి. ఎంసీహెచ్‌ ‌హాస్పిటళ్ల నిర్మాణానికి రూ. 499 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎంసీహెచ్‌ ‌హాస్పిటళ్ల సంఖ్య పెంచడంతో మాతా శిశు మరణాలు తగ్గాయన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు మాతా మరణాలు ప్రతి లక్షకు 92 మరణాలు ఉండెనని.. దాన్ని 43కు తగ్గించగలిగామని అన్నారు. ప్రతి లక్షకు శిశు మరణాలు 36 ఉంటే 21కి తగ్గించుకున్నామని తెలిపారు.

మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలో మూడో స్థానంలో ఉన్నామని, మొదటి స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకు సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటళ్ల అవసరం ఉందని హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. గాంధీలో 200 పడకల సూపర్‌ ‌స్పెషాలిటీ, నిమ్స్‌లో 200 పడకలు, అల్వాల్‌లో కూడా 200 పడకల సూపర్‌ ‌స్పెషాలిటీ ఎంసీహెచ్‌ ‌హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిమ్స్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న ఎంసీహెచ్‌ ‌హాస్పిటల్‌ని రూ. 55 కోట్లతో 4 అంతస్తుల్లో 200 పడకలతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.  ‘వీరందరికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తున్నాం. డయాలసిస్‌ ‌రోగులను కాపాడుకునేందుకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ‌చేస్తున్నాం. ఆసరా పెన్షన్లు, ఉచిత బస్‌ ‌పాస్‌లను కూడా అందిస్తున్నాం. ఇవాళ నిమ్స్‌లో రూ.9 కోట్లతో కొత్త ఎంఆర్‌ఐ ‌మెషీన్‌ను ప్రారంభిస్తున్నాం. 34 మంది కొత్త అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్లకు ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నాం. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులను పెంచుతున్నాం’ అని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు

Leave a Reply