- వెంటనే విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు
- కొట్టివేత పై స్టే కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం ..నేడు స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ
- 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబా
మంబయి, అక్టోబర్ 14(ఆర్ఎన్ఎ) : దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు కోర్టులో ఊరట దక్కింది. ఆయనను నిర్దోషిగా గుర్తిస్తూ బాంబే హైకోర్టు ప్రకటించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే కేసులో శిక్ష అనుభవిస్తున్న దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆయనను వెంటనే విడుద చేయాలంటూ కోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2017లో గచ్చిరోలి జిల్లాకోర్టు సాయిబాబా కు యావజ్జీవ కారగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబా బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ ప్రొఫెసర్ సాయిబాబా కేసును శుక్రవారం • విచారణ చేపట్టింది. ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ప్రొఫెసర్ సాయిబాబా, మరో ఐదుగురిపై 2017లో యుఏపీఏ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిబాబా దేశద్రోహానికి పాల్పడ్డా రంటూ పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి గడ్చిరోలి జిల్లా కోర్టు యావజ్జీవ కారగార శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలంటూ పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. చివరకు ముబై హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ప్రొఫెసర్ సాయిబాబకు విముక్తి లభించింది. ముంబై హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ ఆ కేసులో ప్రొఫెసర్ సాయిబాబను నిర్ధోషిగా తేల్చింది.
తక్షణమే ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం శరీరం క్షీణించడం వల్ల అతను వీల్చైర్పై ఉంటున్నాడు. నాగపూర్లోని సెంట్రల్ జైలులో అతను శిక్షను అనుభవిస్తున్నాడు. ఇదే కేసుతో లింకు ఉన్న మరో అయిదుగురిని కూడా నిర్ధోషులుగా ప్రకటించారు. ఓ వ్యక్తి మాత్రం కేసు విచారణ సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ వీళ్లంతా మరో కేసులో లేకుంటే వాళ్లను వెంటనే రిలీజ్ చేయాలని బెంచ్ ఆదేశించింది. మరో వైపు సాయిబాబా కేసు కొట్టివేత మీద మహారాష్ట్ర స్పెషల్ లీవ్ పిటిషన్ ను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో దాఖలు చేయగా నేటి ఉదయం 11 కు బెంచ్ మీదికి వస్తుందని నోటీసు జారీ అయినట్లు తెలుస్తుంది.