బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

శ్వేతకి ద్వాదశ వర్ష యజ్ఞం గావించాడు. ఆహుతి చేసిన ఆజ్యం తనకు జీర్ణంకాక, అగ్ని బాధపడుతూవున్నాడు. ఆ బాధ నుండి విముక్తి పొందేందుకు ఖాండవ వనాన్ని స్వాహా చేసే సంకల్పంతో వనాన్ని  ముట్టడించాడు. వనం కాలిపోతున్నది. కాలి బూడిదైపోతున్నది. జంతువులు రోదనచేస్తున్నాయి. దేవేంద్రునికి ఈ విషయం తెలియగానే.కుంభవృష్టి కురిపించాడు. మంటలు మీద నీళ్ళు పడగానే పొగ వనమంతటా వ్యాపించింది. అర్జునుడు అది గమనించి వెంటనే తన బాణాలతో వర్షపు చినుకు పడకుండా ఆపేసాడు. తక్షకుడి కుమారుడు అశ్వసేనుడు వేడిని తట్టుకోలేక ఆర్తనాదాలు గావించాడు.
అతని తల్లి, నోటితో ఆ బిడ్డను పట్టుకుని వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంటే అర్జునుడు దాన్ని ఖండించాడు. ఇంద్రుడూ, అర్జునుడూ తలపడ్డారు. అస్త్రాలు వేసుకున్నారు. కొంతసేపు పోరాడిన తర్వాత దేవేంద్రుడు పోరు ఆపి వెళ్ళిపోయాడు. అగ్ని హోత్రుడు ఖాండవ వనాన్ని పదిహేను రోజులు ఆహుతి గావించాడు. తృప్తిగా ఆరగించాడు. మయుడు తప్పించుకోవాలని ప్రయత్నించగా కృష్ణుడు చంపాలనుకున్నాడు. కానీ అర్జునుడు మయునికి అభయం ఇచ్చాడు. గావున బతికిపోయాడు. ఖాండవ వన దహనంలో ఆహుతి కానివారు అశ్వసేనుడూ, శౌర్జకాలనే నాలుగు పక్షలూ మరియు మయుడూను. ఖాండవవనం అగ్నికి ఆహుతి కాగానే కృష్ణార్జునులు ఆనందంగా ఇంద్రప్రస్థం చేరుకున్నారు.
మయసభ
కృష్ణార్జునులు ఆనందంగా ముచ్చటలాడుకుంటున్న సమయంలో మయుడు వారి వద్దకు వచ్చాడు. ఖాండవ దహనంలో రక్షించబడినవాడే ఇతడు. కృతజ్ఞతాభావంతో వారిని ఏదో ఒక పనిచేయించుకోవాల్సిందిగా అర్ధించాడు. మయుడు మహాశిల్పి. కృష్ణుడు సభాభవన నిర్మాణం చేయమన్నాడు. మయుడు అందుకు అంగీకరించి, భవన నిర్మాణానికి ముందు, వృషపర్వుని రాజధాని బిందుసరంలో వున్న మణిభాండాన్నీ గదాదండాన్నీ దేవదత్త శంఖాన్నీ తెచ్చాడు. భీమునికి గధను బహుకరించాడు. గదా శంఖాలను కూడా వారికిచ్చాడు.

(మిగతా..వొచ్చేవారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *