- ఆధారాలు ఇవ్వాలని కోరిన సిట్
- కేసును నీరుగార్చే యత్నం : సిట్ నోటీసులు రాగానే స్పందిస్తానన్న రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపింది. పేపర్ లీక్పై రేవంత్ చేసిన ఆరోపణలపై అధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. పేపర్ లీక్ మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అని రేవంత్ ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇందులో కేటీఆర్ పాత్ర కూడా ఉందని రేవంత్ ఆరోపించారు. లీకేజీ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్, మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ఇద్దరూ దోస్తులని, రాజశేఖర్కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనేనని, ఆయన సూచనలతోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి టీఎస్పీఎస్సీకి బదిలీ చేశారని రేవంత్ ఆరోపించారు.
మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ షాడో సీఎం అయితే, ఆయన పీఏ షాడో మంత్రి అని రేవంత్ అన్నారు. మంత్రి పీఏ సొంతూరు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలమని, రాజశేఖర్ది కూడా ఇదే మండలమని, గ్రూప్1 పరీక్షలో ఈ మండలానికి చెందిన 100 మందికి పైగా 103కు పైగా మార్కులు వొచ్చాయని ఆరోపణలు గుప్పించారు. అయితే వీటిపై వివరాలు ఇవ్వాలని సిట్ కోరింది. పేపర్ లీక్ పై ఆరోపణలు చేసే రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది.
కేసును నీరుగార్చే యత్నం : సిట్ నోటీసులు రాగానే స్పందిస్తానన్న రేవంత్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారుల నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ రేవంత్ వి•డియాతో మాట్లాడుతూ సిట్ నోటీసులు తనకు ఇంకా నోటీసులు అందలేదని అన్నారు. ఆ నోటీసులకు భయపడేది లేదని, తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్కు ఇవ్వనని.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలని.. అప్పుడే ఆధారాలు ఇస్తానని రేవంత్ స్పష్టం చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ భాగోతం బయటపడాలంటే సిట్టింగ్ జడ్జ్తోనే విచారణ జరిపించాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గద్దె దిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఈ కేసును కావాలనే నీరుగారుస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా నోటిసులు ఇచ్చి, వివరాలు తీసుకుంటామని సిట్ అధికారులు అన్నారు.