- ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోయే పరిస్థితి
- టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్
ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. రైతులు వరి వేస్తే ఉరే అని బెదిరింపులకు పాల్పడి నీటి వసతి ఉన్నప్పటికీ 20 లక్షల ఎకరాలను బీడు భూములుగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభత్వానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. బుధవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాపురం వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేశ్, శ్రీధర్, పల్లె వినయ్తో కలసి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ట్యాక్స్ల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో 5 ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరో 6 యూనివర్సిటీలను తేవడం ప్రభుత్వ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేయడమేమని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ పేరుతో భూములను తీసుకుని బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనీ విమర్శించారు. కేసీఆర్ అనాలోచిత విధానాల కారణంగా సాగుచేయకుండా నష్టపోయిన బీడు భూముల రైతులతో కలసి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్ స్పష్టం చేశారు.