Take a fresh look at your lifestyle.

బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌

పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి రాపోలు ఆనందభాస్కర్‌
హైదరాబాద్‌ను యూటి చేసే కుట్ర జరుగుతుందని ఆరోపణ

న్యూదిల్లీ, మే 4 : ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌  పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. రాపోలు ఆనంద భాస్కర్‌తో పాటు మెదక్‌ జిల్లా సీనియర్‌ నేత మహమ్మద్‌ మొహినుద్దీన్‌, వరంగల్‌ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్‌ గౌడ్‌లు బీఆర్‌ఎస్‌ పార్టీని వీడారు. ఈ సందర్భంగా రాపోలు ఆనంద భాస్కర్‌ మాట్లాడుతూ.. విధిలేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నానన్నారు. కేసీఆర్‌ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో తన లాంటి నేతలు ఉన్నారన్నారు. 2022లో కేసీఆర్‌ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి ఇక తన అనుబంధాన్ని తుంచుకుంటున్నానని రాపోలు ఆనంద భాస్కర్‌ తెలిపారు. తాను బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు కేసీఆర్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ కండువాను హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌కి స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపినట్టు తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల కోసం పోరాడేలా తన భవిష్యత్తు కార్యచరణ ఉంటుందన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం ప్రగతి పరిరక్షణ కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తానన్నారు. కుల, జన గణన అంశం ఉద్యమాల్లో తన పాత్ర ఉంటుందన్నారు.

కేసీఆర్‌ గణాంకాల కోసం సకల జనుల సర్వే మాత్రమే చేశారని రాపోలు అన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తోందన్నారు. కుల జన గణన దిశగా అడుగులు వేస్తోందన్నారు. తాను ఉద్యమాల వెంట ఉండే వ్యక్తినని రాపోలు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కొందరికి కంటగింపుగా ఉందన్నారు. తెలంగాణ హైదరాబాద్‌ అభివృద్ధిని ఓర్చుకోలేక పోతున్నారన్నారు. తాను ఎవరిపైనా విమర్శలు చేయబోనని తనకున్న సమాచారం మేరకు ప్రజలను జాగృతం చేస్తున్నానన్నారు. హైదరాబాద్‌ అంశాన్ని రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ అందరి దృష్టికి తీసుకువెళతాన్నారు. ఏ పార్టీలోకి వెళతా అనేది చెప్పలేనని.. ప్రజా ఉద్యమాల్లో ఉంటానని రాపోలు ఆనంద భాస్కర్‌ తెలిపారు.

Leave a Reply