కేవలం ఉనికి కోసమే నిరసన కార్యక్రమాలు
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలు కాస్త పూర్తిగా కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ధర్నాల్లో రైతులు ఎవరూ పాల్గొనలేదన్నారు. బిఆర్ఎస్ ప్రతిపక్ష ఉనికి కోసమే ధర్నాలు చేపట్టిందని బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు ఏమాత్రం స్పందన లేదని ఎద్దేవా చేశారు. *అందుకే ఒక్క రోజు చేసి దిల్లీకి ప్రయాణమవుతున్నారని, అన్నారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు తమ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిదని, రైతులు ఎవరు బిఆర్ఎస్ ట్రాప్ లో పడరు.. బిఆర్ఎస్ ను రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు.
బీజేపీ, బిఆర్ఎస్ లు ఒకే ట్యూన్ ను వినిపిస్తున్నాయని, 12 డిసెంబర్ 2018, 9 డిసెంబర్ 2023 తరువాత తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ కాలేదని స్పష్టం చేశారు. ఇంకా ఎక్కడైనా సాంకేతిక కారణాలు, ఆధార్ కార్డులో పేర్లు తప్పులు లాంటివి ఏమైనా ఉంటే మండల వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. బిఆర్ఎస్ ధర్నాలు చేసేది ఇక్కడ కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్న అదానీ,మోదీలపై ధర్నా చేయాని విజ్ఙప్తి చేశారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ పెద్దలు ఉండలేకపోతున్నారని, గత ప్రభుత్వంలో రుణ మాఫీ కాని రైతులంతా..బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారని ఏ ముఖం పెట్టుకుని డ్రామాలాడుతున్నారని రైతన్నలు ప్రశ్నించాలని మంత్రి పొన్నం సూచించారు.