హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7 : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాలని ఆ ముగ్గురు అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు.
నామినేషన్ల దాఖలుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.