ఆ పార్టీని దేశం నుంచి పారద్రోలే వరకు పోరాటం ఆగదు
కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకో..
సోనియా, రాహుల్ గాంధీలు ఈడీ కేసులకు భయపడరు
రాహుల్ పాదయాత్రతో…బిజెపి బంగాళాఖాతంలో కలవడం ఖాయం
భారత్ జోడోను అడ్డుకునేందుకే అక్రమ కేసులు
80 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్న మోడీ
మోడీ హామీల వైఫల్యాలను పాదయాత్రలో రాహుల్ నిలదీస్తారు
మహబూబ్ నగర్ పాస్ పోర్ట్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మహబూబ్నగర్, ప్రజాతంత్ర, జూలై 22 : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పెట్టిన మనీ లాండరింగ్ కేసు కేవలం కక్షపూరితమని, ఈడి కేసులకు వారు భయపడరని, కాంగ్రెస్ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భాజపాపై నిప్పులు చెరిగారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమానికి హాజరై భట్టి మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నాడే తూటాలకు కాంగ్రెస్ భయపడలేదని, ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాహుల్ గాంధీలపై కక్షపూరితంగా ఈడి కేసు బనయించారని, ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదని అన్నారు. అధినేత రాహుల్గాంధి ఆక్టోబర్ 2 నుంచి చేపట్టబోయే పాదయాత్రతో…కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలువడం ఖాయమని భయపడిన ప్రధాని మోడీ భారత్ జోడోను అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈడితో సోనియా, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు పెట్టారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ పత్రికలో మని లాండరింగ్ ఏలా జరుగుతదని మోడీని నిలదీశారు. గతంలో విచారణ చేసి ఏమీ లేదని తేల్చి ఈ కేసును మూసి వేశారని అన్నారు.
రాహుల్ గాంధీ నిర్వహించబోయే పాదయాత్రతో మోడీ అకృత్యాలు బయటపడుతాయన్న భయంతో, భారత్ జోడోను అడ్డుకునేందుకు కక్ష్య సాధింపు ధోరణితో తిరిగి ఈకేసును పున ప్రారంభించి విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతన్నారని, ఎన్ని కుట్రలు చేసి అడ్డంకులు సృష్టించినా భారత్ జూడో పాదయాత్రను ఆపడం మోడీ తరం కాదన్నారు. సోనియా, రాహుల్ గాంధిపై అక్రమ కేసులు పెట్టి ఈడి కార్యాలయానికి పిలిపించి విచారణ పేరిట వేదింపులకు పాల్పడుతన్న కేంద్ర ప్రభుత్వ బిజెపి దమన నీతిని, వైఖరిని నిరసిస్తూ శుక్రవారం మహబూబ్ నగర్ పాస్ పోర్ట్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ కమిటీ చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయం నుంచి పాస్ పోర్ట్ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ..ప్రజలకు అచ్చెదిన్ తీసుకువస్తానని అధికారంలోకి వొచ్చిన మోడీ సర్కార్ ఉద్యోగాలు ఇవ్వకుండా, రోజు రోజుకు అన్ని వస్తువులకు ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతూ ప్రజలకు సచ్చె దిన్ తీసుకువచ్చారని అన్నారు. 80 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి దేశాన్ని తాకట్టు పెట్టిన మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు, నోట్ల రద్దుతో తీసుకువస్తానన్న నల్లధనం హామీలు ఏమయ్యాయని ఈ సందర్భంగా భట్టి నిలదీశారు. కానీ, తన స్నేహితులైన కార్పొరేట్ అధిపతులు అంబానీ, ఆదానీలకు మాత్రం దేశ సంపదను, ప్రభుత్వ సంస్థలను, వనరులను దారదత్తం చేస్తున్నారని, మోడీ పాల్పడుతున్న ఈ ఆర్థిక ఆకృత్యాలు రాహుల్ పాదయాత్రతో బయటపడుతాయన్న భయం బిజెపికి పట్టుకుందన్నారు.
అందుకనే ఆక్టోబర్ 2 నుంచి కన్యకూమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ చేపట్టే భారత్ జోడో పాదయాత్రను అడ్డుకునేందుకు మోడీ సర్కార్ అడుగడుగున కుట్ర చేస్తున్నదని వివరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ పాదయాత్ర చేసి తీరుతారని వెల్లడించారు. ఈడీ, సీబీఐ, ఐటీ, న్యాయ స్థానాలను తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి నవభారత నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ దేశంలో మత ఘర్షణలు సృష్టించి, దేశ విభజనకు పాల్పడుతున్న మోడీ ఆ కృత్యాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి, జాతిని ఐక్యం చేయాలని ఉదయ్పూర్ చింతన్ శిభిర్లో ప్రణాళికలను రూపొందించిందని, అందులో భాగమే భారత్ జోడో పాదయాత్ర అని వివరించారు. రవి అస్తమించని సామ్రజ్యాన్ని ఏలిన బ్రిటిష్ పాలకుల తూటలకు ఎదురొడ్డిన కాంగ్రెస్ పార్టీ, గాంధీ, నెహ్రు కుటుంబ వారుసులైన సోనియా, రాహూల్ గాంధీలు బిజెపి చేసేటువంటి చిల్లర రాజకీయాలకు, కక్షపూరిత వేధింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడరని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనిరుద్ రెడ్డి, నయిమ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు సంజీవ్ ముదిరాజ్, వినోద్, ప్రశాంత్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి, చంద్రకాంత్, బెక్కరి అనిత, ఎంపీపీ కాంతమ్మ, లక్ష్మణ్ యాదవ్, సిజే బెనహర్, రాములు యాదవ్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




