పెట్రో, విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు నిరసనగా…
ధాన్యం చివరి గింజ కొనేవరకు పోరాటం ఆగదు
నేడు విద్యుత్ సౌధ ఎదుట కాంగ్రెస్ ధర్నా
జూమ్ సమావేశంలో పార్టీ శ్రేణులకు పిసిసి ఛీఫ్ రేవంత్ దిశా నిర్దేశం
న్యూ దిల్లీ, ఏప్రిల్ 6 : ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలు తగ్గే వరకు విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు, రైతులు పండించిన పంటలు చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటాలు సాగుతాయన్నారు. బుధవారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు విజయవంతంగా చేయాలని, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ తమ పక్షాన పోరాటం చేస్తుందని ప్రజలు విశ్వసించాలని, ఐదు అంశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు జరగాలని, రైతులకు భరోసా వొచ్చే వరకు ప్రతి వరి గింజ కొనేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైఖరిపైన ఉద్యమాలు చేయాలని రేవంత్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కేంద్రం, రాష్ట్రం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులకు నష్టం చేసే పరిస్థితులు కల్పిస్తున్నారని, ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం అంటూ ఒకరిపైన ఒకరు ప్రకటనలు చేసుకుంటూ ఇష్యూను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఏ బియ్యం అయిన కొనండి కానీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మనం పోరాటం చెయ్యాలని, నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడి పెద్దఎత్తున జరగాలన్నారు. ప్రతి నాయకుడు పాల్గొనాలని, టిఆర్ఎస్ ఉద్యమాలను అడ్డుకునే కుట్ర చేస్తుందని, ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పోలిస్ స్టేషన్లలో కూడా ఉద్యమం కొనసాగాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛతీసుఘడ్లో ధాన్యం క్వింటాల్కు మద్దతు ధర 1960 తో పాటు 600 రూపాయలు బోనస్ ఇస్తూ కొంటున్నామని, భవిష్యత్ కార్యాచరణ, కార్యక్రమాల వివరాలు మళ్ళీ నాయకులతో చర్చించి ప్రకటిస్తామన్నారు. ఈ నెలాఖరున ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్లో జరిగే సమావేశానికి రావాలని ప్రతిపాదన పెట్టామని, సమావేశానికి రాహుల్ గాంధీ వొచ్చిన సమయంలో.. డీసీసీ అధ్యక్షులతో కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతారని, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక చేద్దామని రేవంత్ అన్నారు.