పేదవానిపై భారం పడకుండా ఆదాయ వనరుల పెంపు

హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట
ఇసుక ద్వారా ఆదాయం పెంపుతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు
ఇసుక, మద్యం విభాగాల్లో అక్రమాలకు అడ్డుకట్టతో ఆదాయం పెంపు
క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : రాష్ట్ర ఆదాయం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి పోకుండా చూడాలని వివిధ శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. పేదవాడిపై భారం పడకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకునేలా రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకోవడం, వనరుల నిర్వహణపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సభ్యులైన, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావులు, సిఎస్‌ శాంతి కుమారి, స్పెషల్‌ సిఎస్‌ రామకృష్ణా రావు, హెచ్‌ఎండిఏ కమిషనర్‌ దాన కిషోర్‌, సిసిఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏ రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ప్రతివారం సమీక్ష సమావేశం నిర్వహించాలని గత సమావేశంలో చర్చించిన అంశాల్లో ప్రగతిని నివేదించాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆదేశించారు.

హైదరాబాద్‌ లోపట పరిసరాల్లో ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు నిరంతరం అప్రమత్తతో ఉండాలని, అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు కాపాడటమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. సహజ వనరు అయిన ఇసుక ద్వారా ఆదాయం పెంచుకోవడమే కాదు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత కాలంలో ఉన్న ఇసుక పాలసీని ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ ఇసుక ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయన్న ప్రచారం జరగడం వెనుక కారణాలు విశ్లేషించి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక బహిరంగ వేలం నిర్వహించాలని, వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో ఇసుక అందుబాటులో ఉంచాలని, ఇసుక కోసం ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లాల్సిన పని లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో గృహ నిర్మాణం ఇతర రంగాల్లో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ లీజులను సమీక్షించి లీజు ఛార్జీలు పెంచే కసరత్తు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా హెచ్‌ఎండిఏ, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్స్‌, పర్యాటక రంగంలో ఉన్న లీజులను సమీక్షించాలన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసరాలపై దృష్టి పెట్టాలని హెచ్‌ఎండిఏ అధికారులకు సూచించారు. ఈ ప్రాంతాల్లో వివిధ విభాగాల ద్వారా సమన్వయం చేసుకుని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి వొచ్చిన దరఖాస్తులు వాటి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గతంలో బూమ్‌ రావడానికి కారణాలు, ప్రస్తుతం పరిస్థితిని సమీక్షించారు. మద్యం తయారు చేసే పరిశ్రమల నియంత్రణ, ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో నమోదవుతున్న స్టాక్‌, మార్కెట్లోకి వొచ్చినప్పుడు ఉన్న స్టాకు వ్యత్యాసాలను ఎలా గుర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

నాన్‌ డ్యూటీ లిక్కర్‌ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకుంటున్న చర్యలను ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని డిప్యూటీ సీఎం వివరించారు. ఇతర రాష్ట్రాల్లో మధ్య ధరలు, మన రాష్ట్రంలో మద్యం ధరలకు వ్యత్యాసంపై సమీక్షించారు. కల్తీలను నివారించేందుకు ప్రత్యేక హోలోగ్రామ్స్‌తో సెక్యూరిటీ వ్యవస్థ, సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు పెంచడం తదితర అంశాలపై ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే మద్యం తయారుచేసి పన్ను చెల్లించడం లేదా, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా మూలంగా రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయంపై ప్రభావం పడుతుందా తదితర అంశాలను మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సామాన్యుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మట్టి తరలించే క్రమంలో పోలీసులు, మైనింగ్‌ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ అంశంలో జాగ్రత్తగా వివరించాలని అధికారులకు మంత్రులు ఉత్తమ్‌, జూపల్లిలు సూచించారు. రాష్ట్రంలో లైమ్‌ స్టోన్‌ ఖనిజాలతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలో మాంగనీసు అందుబాటులో ఉంది ఇలా ఇతర జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్న ఖనిజాల వివరాలు సేకరించి ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌ బాబు సూచించారు. గోదావరి నుంచి ఇసుక తరలించే క్రమంలో ఒకే బిల్లుపై మూడుసార్లు అధిక లోడుతో ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వానికి ఒక శాతం ఆదాయం ఇస్తుంటే స్థానికంగా రహదారులు ప్రజల ఆరోగ్యం మూడు రెట్లు దెబ్బతింటుంది ఈ వ్యవస్థను నియంత్రించాలని మైనింగ్‌ శాఖ అధికారులకు మంత్రి శ్రీధర్‌ బాబు సూచించారు. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ప్రతి రీచ్‌ లో సీసీ కెమెరాలు, ప్రధాన కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ,  ఇసుక రవాణా చేసే వాహనాల ట్రాకింగ్‌ వ్యవస్థను ఆచరణలో పెట్టి పకడ్బందీగా అమలు చేయాలని తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు సామాన్యులకు ఇసుక అందుబాటులోకి వస్తుందని అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రికల్‌ వాహనాలపై ఇప్పుడే పనులు విధించే ఆలోచన విరమించుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్‌ వాహనాల ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు క్రమంగా మన రాష్ట్రంలోకి వొస్తున్నాయి. ఈ క్రమంలో పనుల భారం మోపితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఉపాధిపై  ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అని మంత్రి శ్రీధర్‌ బాబు అధికారులకు తెలిపారు. జీవో నెంబర్‌ 188 పరిధిలో కాలనీలా రిజిస్ట్రేషన్‌, సింగరేణి కార్మికుల కాలనీల రిజిస్ట్రేషన్‌ తద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయం గురించి మంత్రి శ్రీధర్‌ బాబు అధికారులతో సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *