- భువనగిరి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో సిఎం రేవంత్ దిశానిర్దేశం
- నామినేషన్ వేయనున్న 21న బహిరంగ సభ నిర్వహణకు సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, మనం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టాలని నేతలకు సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నివాసంలో జరుగగా సిఎం రేవంత్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21న నామినేషన్ వేయనున్న నేపథ్యంలో అదే రోజు భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం సూచించారు.
మే తొలివారంలో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని రేవంత్రెడ్డి తెలిపారు. గెలుపు కోసం ప్రజలను కలిసి నేరుగా వోట్లు కోరాలని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రాజగోపాల్రెడ్డి, లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతోపాటు ముఖ్యనాయకులు హాజరయ్యారు. భువనగిరిలో చామల కిరణ్కుమార్ రెడ్డి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సీఎం కోరారు.





