- తిలకం దిద్ది ఆశీర్వదించిన సంజయ్ తల్లి
- రూ.11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఈడి
ముంబై, ఆగస్ట్ 1 : పాత్రాచాల్ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఈడీ ఆదివారం అరెస్టు చేశాక, సోదాలు నిర్వహించి రౌత్ ఇంట్లో రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలను ప్రత్యేకంగా ఒక కవర్లో ఉంచినట్లు వారు గుర్తించారు. ఆ కవర్పై ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పేరు రాసి ఉంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రౌత్?ను ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నప్పుడు ఆయన తల్లి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. ఆదివారం రౌత్ ఇంట్లో 9 గంటల పాటు సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ అధికారులు రూ.11.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలు ప్రత్యేక కవర్లో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో సోదాల తర్వాత ముంబయిలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఆయన్ను ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అయితే, రౌత్ విచారణకు సహకరించడంలేదని ఆదివారం అర్ధరాత్రి 12.05 గంటలకు ఈడీ ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది.
పాత్రాచాల్ భూకుంభకోణంతో సంజయ్ రౌత్, ఆయన సతీమణి వర్షా రౌత్ మరికొంతమందికి సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వర్షా రౌత్కు చెందిన రూ.11.15 కోట్ల విలువచేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసు విషయమై రౌత్ను జులై 1న దాదాపు 10 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. మరో రెండు సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన హాజరు కాలేదు. ఆ నేపథ్యంలో ఆదివారం ఈడీ ఆకస్మిక సోదాలు చేపట్టింది.
అనంతరం ఆయన్ను కార్యాలయానికి తరలించేటప్పుడు కొన్ని సెంటిమెంట్ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. బయటకు వెళ్తుండగా రౌత్ తల్లి ఆయనకు హారతి ఇచ్చి తిలకం దిద్దారు. ఆయనేమో తల్లి పాదాలకు నమస్కరించి, ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ రోజు సంజయ్ను కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దాంతో ఆ కోర్టు పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. అలాగే ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ.. సంజయ్ను 10 రోజుల కస్టడీ ఇవ్వాలని అడగనున్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్టుపై భాజపాను విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తాము సంజయ్తోనే అంటూ కాంగ్రెస్ ఉద్ధవ్ వర్గానికి మద్దతు ప్రకటించింది.




