నేడు, రేపు దేశవ్యాప్త సమ్మె

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 27 : కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నేడు, రేపు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు జాతీయ కార్మిక సంఘాల జాయింట్‌ ‌ఫోరం ప్రకటించింది. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 48 గంటలపాటు సమ్మె చేయాలని ఫోరం ఈ నెల 22న జరిగిన సమావేశంలో నిర్ణయించింది. కాగా సమ్మెలో రోడ్‌వేస్‌, ‌రవాణా, విద్యుత్తు రంగాల కార్మికులు కూడా పాల్గొంటారని ఫోరం తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకింగ్‌, ‌బీమా రంగాలతో సహా ఆర్థిక రంగాల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్మా ప్రయోగిస్తామని బెదిరిన్నప్పటికీ సమ్మె జరిగి తీరుతుందని ఫోరం హెచ్చరించింది. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, తపాలా, ఆదాయపు పన్ను, కాపర్‌, ‌బ్యాంకులు, బీమా తదితర రంగాలలో పని చేస్తున్న కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చారని, రైల్వేలు, రక్షణ రంగాల్లోని యూనియన్లు దేశవ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో తమకు మద్దతు పలుకుతారని ఫోరం ఈ సందర్భంగా పేర్కొంది.

నేడు, రేపు తాము గ్రామీణ ప్రాంతాల్లో బంద్‌ ‌పాటిస్తామని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పునరుద్ఘాటించడాన్ని ఈ సమావేశం స్వాగతించింది. ఈ సంయుక్త కార్మిక సంఘాల ఫోరంకు ఆలిండియా బ్యాంక్‌ ఎం‌ప్లాయీస్‌ అసోసియేషన్‌ ‌మద్దతిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు వ్యతిరేకిస్తూ..బ్యాంకింగ్‌ ‌చట్టాల సవరణ బిల్లు, 2021ని కూడా ఈ సంఘాలు వ్యతిరేకిస్తుండడంతో సహజంగానే అవి సమ్మెకు తమ మద్ధతును ప్రకటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page