- వరంగల్ ఆర్టస్ కాలేజీలో రైతు సంఘర్షణ సభలో ప్రసంగం
- సాయంత్రం హైదరాబాద్కు…నేరుగా వరంగల్ సభకు
- రైతల సంక్షేమం కోసం వరంగల్ డిక్లరేషన్ ప్రకటన
సభ కోసం భారీగా ఏర్పాట్లు - గల్లీ నుంచి దిల్లీ వరకు నేతల ఐక్యతారాగం
- రాహుల్ రాక సందర్భంగా భారీ బందోబస్తు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుత్తేజమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండురోజుల పర్యటనకు వొస్తున్నారు. నేడు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్, అదేరోజు సాయంత్రం హన్మకొండలో జరిగే రైతు సభలో ప్రసంగిస్తారు. రైతులకు అండగా నిలవడం, కెసిఆర్ పాలనను, కేంద్రంలో బిజెపి పాలనను నిలదీయడం లక్ష్యంగా రాహుల్ పర్యటన ఖరారు చేశారు. సభ ప్రధాన అజెండా వ్యవసాయ రంగం, రైతుల సమస్యలు కావడంతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రాహుల్గాంధీ స్పష్టంగా వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. రైతాంగ సంక్షేమంపై ‘వరంగల్ డిక్లరేషన్’ను రాహుల్గాంధీ ప్రకటిస్తారని పీసీసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో డిక్లరేషన్పై ఆసక్తి నెలకొంది. ఈ మేరకు రాహుల్ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. పిసిసి చీఫ్గా రేవంత్ను నియమించాక రాహుల్ తెలంగాణకు రావడం ఇదే ప్రథమం. ఈ సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని చూస్తున్నారు.
అదే సమయంలో అధికార టిఆర్ఎస్ అరాచకాలను నిదీయాలన్న లక్ష్యంతో ఉన్నారు. హనుమకొండలో శుక్రవారం తలపెట్టిన ‘రైతు సంఘర్షణ సభ’… కాంగ్రెస్లో జోష్ నింపుతుందదన్న భరోసాలో భారీగా ఏర్పాట్లు చేసారు. సభ విజయవంతానికి హస్తం నేతలు ఒక్కటై కదిలారు. ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వం దిశా, నిర్దేశం చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే ‘సభ’ ప్రతిష్టాత్మకతను ప్రకటించింది. రైతుల సమస్యలే ప్రధాన అజెండాగా సభను నిర్వహిస్తుంది. రైతు శ్రేయస్సే ప్రధాన అంశంగా ‘వరంగల్ డిక్లరేషన్’ను రాహుల్గాంధీ ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించిన నేపథ్యంలో ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా రైతులు, ప్రజా సంఘాలు ఇతర వర్గాలో ఆసక్తి నెలకొంది. వరంగల్లోనే సభ నిర్వహించాలని టీపీసీసీ తలపెట్టడానికి పోరుగల్లు నుంచే సమర శంఖం పూరించాలనే ఉద్దేశమైతే…ఆర్టస్ కళాశాల మైదానాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం 2002లో జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సభ.
నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సభ కాంగ్రెస్ దిశను మార్చి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది. 20 ఏళ్ల తరువాత ఇక్కడే ‘రైతు సంఘర్షణ సభ’ నిర్వహణ ద్వారా తిరిగి అధికారాన్ని పొందుతామనే ధీమాతో పీసీసీ సభ నిర్వహణకు ఆర్టస్ కళాశాల మైదానాన్ని ఎంచుకుంది. 5 రోజులుగా ఏఐసీసీ నుంచి జిల్లా నాయకత్వం వరకు ‘రైతు సంఘర్షణ సభ’ నిర్వహణ ప్రణాళికలో తలమునకలయ్యారు. దిల్లీ నుంచి జిల్లా వరకు నేతలు హనుమకొండకు తరలివస్తూ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సభ నిర్వహణ కోసం టీపీసీసీ మొత్తంగా 28 కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను విభజించింది. సభకు 5 లక్షల మందిని తరలించాలని పీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2300కు పైగా బస్సులు, 2 వేల డీసీఎంలు, 5 వేలకు పైగా క్రూజర్స్, టాటాఏస్ ఆటోలు 40 వేలు ఇతర వాహనాలను భారీ సంఖ్యలో తరలింపునకు సమకూర్చుకుంది.
టూ వీలర్స్పై కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కార్యకర్తలు, నేతలు తరలేలా ఏర్పాట్లు జరిగాయి.
రాహుల్ పర్యటన ఇలా…
ఇక రాహుల్ గాంధీ 2 రోజుల రాష్ట్ర పర్యటనకు సంబంధించిన కార్యక్రమాన్ని పీసీసీ విడుదల చేసింది. దాని ప్రకారం…మే 6వ తేదీ సాయంత్రం 4:50కి రాహుల్ గాంధీ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5:10కి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు. సాయంత్రం 6:05 గంటలకు వరంగల్ ఆర్టస్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో స్టే చేస్తారు.
మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. అక్కడ దివంగత కాంగ్రెస నేత, మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. తర్వాత మధ్యాహ్నం 1:15 గంటలకు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు గాంధీ భవన్లో పార్టీ అంతర్గత కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో రాజకీయాల తీరు, పార్టీ పరిస్థితి తదితర విషయాల గురించి పీసీసీ నేతలతో రాహుల్ చర్చించనున్నారు. ఆ సమావేశానంతరం మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీకి వెళ్తారు.
సభా వేదికపై రైతులతో కలిసి కూర్చోనున్న రాహుల్..
వరంగల్ సభ ఆరంభానికి ముందు రాహుల్గాంధీ రైతు కుటుంబాలను కలిసి ప్రధాన వేదికపై ఆసీనులవుతారు. సభ ప్రధాన వేదికపై రాహుల్గాంధీతో పాటు మొత్తంగా 50 మంది నేతలు కూర్చుంటారు. ఇక వేదిక వెనకాల గ్రీన్ రూమ్ నిర్మిస్తున్నారు. 40 మంది వరకు ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయి ముఖ్య నేతలు వేదికపైకి ఆహ్వానించని వారు గ్రీన్ రూమ్లో ఉంటారు.
ఖాజీపేట ఫాతిమానగర్ సెయింట్ గాబ్రియేల్ హెలీప్యాడ్ వద్దకు రాహుల్ గాంధీ 5 గంటల సమయంలో చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనాల ర్యాలీ ద్వారా సభ వేదిక వద్దకు 5:30 గంటలకు చేరుకుంటారు. ఫాతిమానగర్ నుంచి రాహుల్గాంధీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ కదులుతారు. దాదాపు 2.5 కిలోవి•టర్ల పొడవునా రాహుల్గాంధీ ర్యాలీ ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్ల నిర్మాణం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.