- అన్ని వరాలకు, అన్ని ప్రాంతాలకు ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు
- 3 అంచెల వ్యవస్థను 5 అంచలుగా విస్తరణ
- రోజుకి 25 వేల నుంచి 30 వేల మందికి ప్రభుత్వ వైద్య సేవలు
హైదరాబాద్, ఏప్రిల్ 3 : అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించింది. 2014తో పోల్చితే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక లక్ష ప్రసవాలకు 2014లో 92 ఉన్న మాతృమరణాలు, 2022 నాటికి 56కు తగ్గాయి. 2014లో 39 ఉన్న శిశుమరణాలు, 2022 నాటికి 23కి తగ్గాయి.2014లో 5 సంవత్సరాలలోపున్న పిల్లల మరణాలు 41 ఉంటే, 2022 నాటికి ఆ సంఖ్య 30కి పడిపోయింది. అదే కాలంలో 25 ఉన్న బాలింత మరణాలు 16కు తగ్గాయి. ఇమ్యూనైజేషన్ టీకాల విషయానికి వస్తే 2014లో 68 శాతం ఉంటే, 2022 నాటికి 100 శాతంకు చేరింది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య 2014లో 30 శాతం ఉంటే, 2022 నాటికి 56 శాతం పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్య 98 శాతంకు పెరిగింది.
అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉంది.
అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘‘నీతి ఆయోగ్’’ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రం కేరళ, తమిళనాడు తర్వాత 3వ స్థానానికి చేరింది. తలసరి ప్రభుత్వం చేస్తున్న వైద్యఖర్చుల్లో రూ.1,698 లతో హిమాచల్ ప్రదేశ్, కేరళ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిలిచింది. 2022-23 బడ్జెట్లో దానిని రూ.3,091లకు పెంచారు. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హెల్త్ ఫిట్నేషన్ కాంపెయిన్లో 3 కేటగిరిల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణ రాష్ట్రం 3 అవార్డులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించిన ‘‘సర్వేజన సుఖీనోభవంతు’’ నినాదం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జనహిత కార్యక్రమాలు చేపట్టింది. వైద్య సదుపాయల విస్తరణ, నిరంతర మానిటరింగ్తో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలు – కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, అమ్మవడి పధకాల సమ్మిళిత ఫలితాలే జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన ఆరోగ్య సూచికలుగా పేర్కొనవచ్చు.
గాంధీ హాస్పిటల్లో అత్యాధునిక సెంట్రల్ డయాగ్నస్టిక్ లేబరేటరీని ఏర్పాటు చేశారు. మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రాలలో జరుగుతున్న రోగ నిర్దారణ పరీక్షలను మానిటరింగ్ చేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సౌలభ్యం కొరకు 42 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది.
ఈ కేంద్రాల సంఖ్యను 102 కు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. డయాలసిస్ కేంద్రాలకు రోగులు వచ్చేపోయేందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 దవాఖానాల్లో సిటి స్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె సంబందిత శస్త్ర చికిత్సలు నిర్వహించుటకు హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్లలో క్యాథ్ ల్యాబ్లను ప్రభుత్వం నెలకొల్పింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో పారిశుధ్య నిర్వహణను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రతి బెడ్కు చేస్తున్న ఖర్చును రూ 5,000 నుంచి రూ 7,500 లకు పెంచడం జరిగింది. సాధారణ రోగులకు ఇచ్చే డ్కెట్ ఛార్జిలను రోజుకు రూ.40 నుంచి రూ.80 లకు పెంచడం జరిగింది.అందత్వరహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహించిన ‘‘కంటి వెలుగు’’ 2వ దశ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 1 కోటికి చేరువలో కంటి పరీక్షలు చేసి దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి.
తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి రాష్ట్రంలో ప్రభుత్వపరంగా 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. మొదటి దశలో ఒక్కొక్కటి రూ.450 కోట్ల వ్యయంతో కొత్తగా మహబూబ్నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేటలలో ఏర్పాటుచేసిన వైద్య కళాశాలలు నడుస్తున్నాయి. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. 2021లో 8 కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో దానికి రూ.510 కోట్ల వ్యయంతో సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం లలో మెడికల్ కాలేజిల ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో 2014లో ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న 700 యంబిబిఎస్. సీట్లు 2021 నాటికి 1,649 సీట్లకు పెరిగాయి. 2014లో 531 ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు 2021 నాటికి 967కు పెరిగాయి.2014లో 82 ఉన్న సూపర్ స్పెషలిటీ సీట్లు 2021 నాటికి 153 కు పెరిగాయి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు అయిన తర్వాత యంబిబిఎస్. సీట్లు 5,240 కు, పీజీ మెడికల్ సీట్లు 2,500 లకు, సూపర్ స్పెషలిటీ సీట్లు 1,000 కు చేరుతాయి.
హైదరాబాద్ నగరవాసులతో పాటు ఆధునిక వైద్య సేవలకొరకు చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చే వారికి అందుబాటులో వుండే విధంగా ఎయిమ్స్ తరహాలో నగరానికి నాలుగు వైపులా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్(టిమ్స్ ) పేరున సూపర్ స్పెషలిటీ హాస్పిటళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా 1,500 పడకలతో గచ్చిబౌలి లో టిమ్స్ హాస్పిటల్ని ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. మొత్తం రూ.2,679 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 1,000 ఆక్సీజన్ పడకల సామర్థ్యంతో ఆల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డలలో సూపర్ స్పెషలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవలనే శంకుస్థాపన చేశారు. వీటిలో 300 ఐసీయు పడకలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టిమ్స్ హాస్పిటల్లో 26 రకాల ఆపరేషన్ ధియేటర్లు, 30 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల విభాగాలు, 16 స్పెషాలిటీ,15 సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ కోర్సులు, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు ఏర్పాటు కానున్నాయి. నిమ్స్ను విస్తరించుటకు, ఇతర టీచింగ్ హాస్పిటల్స్లో సీట్లు పెంపుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.
పట్టణ పేదలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్లో 256 బస్తీ దవాఖానలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటి స్ఫూర్తితో ముఖ్యమంత్రి ఆదేశాలతో 141 మున్సిపాలిటీలలో కొత్తగా 288 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టుటకు 57 రకాల రోగానిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయుటకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ల్యాబ్ను ప్రభుత్వం నెలకొల్పి, ప్రభుత్వ దవాఖానాలను అనుసంధానం చేసింది. ప్రాధమిక స్థాయిలో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,745 సబ్ సెంటర్లను ‘‘పల్లె దవాఖాన’’లుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.