- బిజెపి తన మనసులోని విద్వేషాన్ని బుల్డోజ్ చేసుకోవాలి
- ట్విట్టర్ ద్వారా కేంద్రంపై రాహుల్ ఫైర్
న్యూ దిల్లీ, ఏప్రిల్ 20 : భారత దేశ రాజ్యాంగ విలువల విధ్వంసం జరుగుతుందని, పేదలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీనికి బదులుగా బీజేపీ తన మనసులోని విద్వేషాన్ని బుల్డోజ్ చేసుకోవాలని హితవు పలికారు. దేశ రాజధాని నగరం దిల్లీలోని జహంగీర్పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బుధవారం తన ట్వీట్ ద్వారా రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఓ బుల్డోజర్ ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం వచ్చే విధంగా ఓ ఫొటోను ఈ ట్వీట్కు జత చేశారు. రాజ్యాంగ ప్రవేశిక, బుల్డోజర్ ఫొటోలను పెట్టారు.
రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, విద్వేషంతో కూడిన బుల్డోజర్స్ను ఆపాలని, పవర్ ప్లాంట్స్ను స్విచాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆక్రమణల పేరుతో ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగానే దిల్లీలో కూడా ఇళ్ళను ధ్వంసం చేయాలని చూస్తోందన్నారు. చట్టవిరుద్ధ ఆక్రమణల విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ వైఖరి అనుమానాస్పదంగా ఉందని మండిపడ్డారు. జహంగీర్ పురిలోని అక్రమ ఆక్రమణలను తొలగించడంలో కేజీవ్రాల్ ప్రభుత్వంలోని పీడబ్ల్యూడీ శాఖ కూడా పాల్గొంటుందా అని ప్రశ్నించారు. ఇలాంటి నమ్మక ద్రోహం చేస్తారని, పిరికితనంతో వ్యవహరిస్తారని ఆయనకు ఈ ప్రాంత ప్రజలు ఓటు వేశారా? అని ప్రశ్నించారు. ఆయన తరచూ పోలీసులులు తన నియంత్రణలో లేరని చెప్తున్నారని, ఈ సాకు ఇక్కడ పని చేయదని మండిపడ్డారు. ఈ విషయంలో చట్టబద్ధత, నైతికత ఎంత మాత్రం లేవన్నారు.
నిస్సహాయ పరిస్థితులు ఉన్నాయన్నారు. దేశంలో బొగ్గు కొరతను రాహుల్ బుధవారం ఇచ్చిన ట్వీట్లో ప్రస్తావించారు. అత్యధిక ద్రవ్యోల్బణం, తీవ్రమైన నిరుద్యోగం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆరోపించారు. ఎనిమిదేళ్ళపాటు గొప్ప గొప్ప మాటలు చెప్పారని, ఇప్పుడు కేవలం ఎనిమిది రోజులకు సరిపడిన బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విద్యుత్తు కోతల వల్ల చిన్నతరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలను కోల్పోవలసి వస్తుందని చెప్పారు.