- అధికారులతో కలసి పంటపొలాలు పరిశీలించండి
- ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా అమలు చేయండి
- మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రజలతో చర్చించండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు భరోసా ఇవ్వాలని, అధికారులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశాలించాలని బిఆర్ఎస్ నేతలకు, శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. వ్యవసాయ క్షేత్రాలను, రైతులను వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిశీలించి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసానిస్తూ.. విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని కేటీఆర్ సూచించారు. పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న పార్టీ ఇన్చార్జిలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశంపైనా దృష్టి సారించాలని, వర్షాకాలం లోపల పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ఉపాధి హావి•తో పాటు పంచాయతీ రాజ్ శాఖ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధిహావి•కి సంబంధించిన రూ.1300 కోట్లు కేంద్రం పెండింగ్లో పెట్టడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యమైందన్నారు. వొచ్చే నెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలన్నారు. ఇందుకు సంబంధించి, ఇప్పటికే జిల్లా ఇన్చార్జిలుగా వెళ్లిన వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యకర్తలు సందేశాన్ని ఇవ్వబోతున్నారన్నారు. దాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలని, ప్రతి కార్యకర్తకు ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండుసార్లు తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దోహదం చేసిన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి పంపే ప్రత్యేక సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలన్నారు. ప్రతి నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాలని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన మేరకు ముందుకు పోవాలని, ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత వారితో ఉన్న అనుబంధాన్ని వివరించేలా కార్యక్రమన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.
సమావేశాల్లో పార్టీ శ్రేణుల ప్రాధాన్యత తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వొచ్చిన తర్వాత మారిన తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులపైనా కూడా విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు మోదీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలపై సైతం పార్టీ కార్యకర్తలకు అర్థమయ్యేలా చర్చించి.. ప్రజా బాహుల్యంలోకి తీసుకెళ్లాలా చూడాలన్నారు. మోదీ ప్రభుత్వం అటు దేశ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రత్యేకంగా చర్చించాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకోవడం, ఇవ్వాల్సిన ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడం, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న తీరును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మహిళా లోకానికి చేరేలా చూడాలన్నారు. ఇంకా ఎక్కడైనా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ప్రారంభం కాకుంటే వెంటనే ప్రారంభం చేసుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు రాష్ట్రస్థాయి నాయకులు, పార్టీ నేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని, ఏప్రిల్ 20న నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుంటే ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించుకోబోతున్నామన్నారు. ఒక్కో పార్టీ ప్రతినిధుల సమావేశంలో 1000 నుంచి 1500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమావేశాలు ఉండనున్నాయన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో జెండా పండుగ కార్యక్రమం ఉంటుందన్నారు. ఏప్రిల్ 7వ తేదీన పార్టీ ప్లీనరీ జరుగుతుందని, దీనికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరవుతారన్నారు.