- ప్రధాని అపాయింట్ మెంట్ కోసం చూపు
- వరిధాన్యం కొనుగోళ్లపై పోరాటమే లక్ష్యంగా కార్యాచరణ
న్యూ దిల్లీ, ఏప్రిల్ 5 : కేంద్రం, తెలంగాణ మధ్య వరి పంట అయితే ఇప్పట్లో తెగేలాలేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో టీఆర్ఎస్ సమరానికి సిద్ధమైంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీసేందుకు సీఎం కేసీఆర్ మరోసారి హస్తిననే నమ్ముకున్నారు. ఈ మేరకు దిల్లీలో మకాం వేసిన కెసిఆర్ ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని గత ఏడాది నవంబర్ 18న ధర్నా చౌక్ వద్ద సీఎం కేసీఆర్ ఆందోళన చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ స్వయాన ముఖ్యమంత్రే ఆందోళన చేయడం అదే మొదటిసారి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి తేలే వరకు నిరసనలు కొనసాగుతాయని అప్పట్లో సీఎం అల్టిమేటం జారీ చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి పియూష్ గోయర్ క్లారిటీ ఇవ్వడంతో ఖంగుతిన్న గులాబీ నేతలు సమరానికి సిద్ధమయ్యారు. ఖరీఫ్, రబీ సీజన్లో పండించిన పంటను కేంద్రమే కొనాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. యాసంగిలో దాదాపు 40 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. అయితే బాయిల్డ్ రైస్కు బదులు రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రం చెప్పడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరో స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు వడ్లనే కొనాలన్న డిమాండ్ ముందుకు తీసుకువొచ్చారు. మరోవైపు పార్లమెంటులో ఎంపిలు వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టి అంశంపై చర్చకు పట్టుబడుతున్నారు.