ప్రజాతంత్ర , హైదరాబాద్ : దసరా కల్లా నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్దేశిత గడువులోనే పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు, ఇంజనీర్లు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవనం లోపల కలియ తిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70 పనులు పూర్తి కాగా, ప్రస్తుతం భవన ముందు భాగంలో ఎలివేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి కొత్త సచివాలయ నిర్మాణం పూర్తి కావాలనీ, ఈ మేరకు పనుల్లో మరింత వేగం పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.